ఇరువురికి తీవ్ర గాయాలు
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఇరువురికి తీవ్ర గాయాలైన ఘటన పట్టణంలోని అచ్చంపేటరోడ్లో పట్టణ శివారులో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన ఆదిమూలపు దివ్య, భర్త రాంబాబు ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో పట్టణంలోని అంబేడ్కర్నగర్కు చెందిన షేక్ సిద్ధిక్ స్కూటీపై పాకాలపాడు వైపు వెళుతుండగా రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆదిమూలపు దివ్య(35) తలకు బలమైన గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. భర్త ఆదిమూలపు రాంబాబుకు తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అలాగే షేక్ సిద్ధిక్ తలకు, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో ఇరువురు క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సిద్ధిక్కు 15 కుట్లు పడగా పరిస్థితి విషమంగా మారింది.పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.
నగరంపాలెం: ఆర్టీసీలోకి ప్రవేశపెట్టే విద్యుత్ బస్లను ఆర్టీసీ ద్వారానే నడపాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మంగళవారం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో నిరాహార దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యుత్ బస్ల డిపోల ఏర్పాటు పేరుతో మూసివేసిన అలిపిరి, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు– 2, గుంటూరు– 2, విద్యాధరపురం డిపోలను పునఃప్రారంభించాలని కోరారు. పెరుగుతున్న మహిళల ఉచిత ప్రయాణికుల దృష్ట్యా బస్లు, సిబ్బందిని పెంపొందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ బస్ల పేరుతో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం సరికాదన్నారు. మూతపడిన డిపోలను వెంటనే పునః ప్రారంభించాలని అన్నారు. శిబిరంలో ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా నాయకులు ఎం.హనుమంతరావు, ముత్యాలరావు, చింతల శ్రీనివాసరావు, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ రాష్ట్ర నాయకులు కె.గంగాధర్రావు, జె.నాంచారయ్య, కె.పాములు మద్దతు ప్రకటించగా, ఫెడరేషన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎంవీఎస్.రామకృష్ణ, కార్యకర్తలు వి.మధుసూదన్రావు, సిహెచ్.శ్రీను, టి.శ్రీను, రవిచంద్, జయశ్రీ, బి.రామాంజనేయులు, ఎల్.వి.ఆర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
నగరంపాలెం: పన్నులు చెల్లించకుండా రవాణాశాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడి, నిర్బంధంలో ఉన్న వాహనాలు ఈనెల 26 వేలం నిర్వహించనున్నట్లు గుంటూరు ఉపరవాణా కమిషనర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు ఉప రవాణా కమిషనరు కార్యాలయ ఆవరణలోని 33, తెనాలి కార్యాలయంలోని 33 వాహనాలు (హెచ్జీవీలు, ఎంజీవీలు, ఎల్జీవీలు, మోటార్ సైకిల్స్, మోటార్కార్, మ్యాక్సిక్యాబ్లు) ఈ వేలంలో విక్రయిస్తామని తెలిపారు. సంబంధిత వాహనాల యజమానులు, ఫైనాన్షియర్లు చెల్లించాల్సిన పన్నులు, అపరాధ రుసుం ఈనెల 25లోగా చెల్లించాలని అన్నారు. లేనిచో ఈనెల 26 మధ్యాహ్నం రెండు గంటలకు గుంటూరు డీటీఓ కార్యాలయంలో వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.


