మృతులు వదిన, మరదలు కావడంతో శోకసంద్రంలో కుటుంబం
పెదకూరపాడు: అమరావతి మండలం దిడుగు గ్రామానికి చెందిన వదిన, మరదలు మృతి చెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. పాలు తాగే పసిబిడ్డలను వదిలి పొట్టకూటి కోసం ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లిన తల్లులు మృత్యువాత పడటం అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. వివరాలు... దిడుగు గ్రామానికి చెందిన బాపట్ల వెంకటేశ్వరమ్మ (28), బాపట్ల లక్ష్మీ తిరుపతమ్మ (25) గ్రామంలో ఉపాధి పనులు లేక విజయవాడకు చెందిన ఈవెంట్ ఆర్గనైజర్ సహకారంతో ఫంక్షన్లలో వంట పనులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో విజయవాడలో గత రెండు రోజులుగా ఫంక్షన్ పనులు ముగించుకొని ఒంగోలులోని వివాహ వేదికకు వెళ్తున్నారు. ఆ క్రమంలో ఒంగోలు సంఘమిత్ర ఫ్లయ్ఓవర్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాపట్ల వెంకటేశ్వరమ్మ భర్త ప్రభుదాస్ గత ఏడాది హైదరాబాద్ నుంచి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వారికి కుమార్తెలు పాలి వేణు (8), సింధు (3), కుమారులు పోలయ్య (7), ప్రభుదాస్ (1) ఉన్నారు. లక్ష్మీ తిరుపతమ్మ భర్త రామాంజనేయులు గ్రామంలోని కూలి పనులు చేస్తుంటాడు. వీరికి కుమార్తెలు పావని (8), సుశీల (1), మూడేళ్ల కుమారుడు ఉన్నారు. పాలు తాగే పసిబిడ్డలను వదిలి పొట్టకూటి కోసం వెళ్లిన తల్లులు కానరాని లోకాలకు వెళ్లడంతో ఆ చిన్నారుల వేదన వర్ణనాతీతంగా మారింది.ప్రభుదాస్కు లక్ష్మీ తిరుపతమ్మ సొంత చెల్లెలు కావడంతో ఇరు కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనతో దిడుగు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
లక్ష్మీతిరుపతమ్మ, వెంకటేశ్వరమ్మ (ఫైల్)


