స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బతింటాం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం సరిగా నిర్వహించడం లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి నారా లోకేష్ యూనివర్సిటీ ప్రతిపాదనకు రాని హామీ
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రూప్ రాజకీయాలున్నాయి.. వాటి వల్ల పార్టీకి ఇబ్బందులొస్తాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. గ్రూపు రాజకీయాలను పరిష్కరించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతామన్నారు. జిల్లాలో కొందరు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. పార్టీ ఆదేశాలను తప్పకుండా పాటించాలని, లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నరసరావుపేట ఎస్ఆర్కేటీ జంక్షన్లో ఉన్న పార్టీ కార్యకర్తలు మల్లమ్మ సెంటర్ వరకు కూడా రాకపోవడం, ఆర్టీసీ బస్టాండ్ వద్దకు వచ్చే సరికి ఎవరూ లేకపోవడంపై స్థానిక టీడీపీ నేతలతో లోకేష్ ఆరా తీసినట్టు సమాచారం. మరోవైపు జేఎన్టీయూ కళాశాలను యూనివర్సిటీగా ఉన్నతీకరించాలని ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన డిమాండ్పై హామీ ఇవ్వకపోవడంతో పెదవి విరిచారు. కళాశాల అధ్యాపకుల కొరత, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులలో వేగం పెంచడంపై స్పందించకపోవడంపై కళాశాల విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.


