● త్రికోటేశ్వరునికి విశేష
అభిషేకాలు, ప్రత్యేక అలంకరణ
● స్వామి వారిని దర్శించుకున్న
వేలాది మంది భక్తులు
నరసరావుపేట రూరల్: తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో భక్తుల సందడి నెలకొంది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి త్రికోటేశ్వరుడిని దర్శించుకొని తరించారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ అర్చకస్వాములు బిందెతీర్థంతో స్వామి వారికి తొలి అభిషేకాలను నిర్వహించారు. పంచామృతాలు, ఫలాలు, విశేష ద్రవ్యాలతో స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం వైభవంగా జరిపారు. అనంతరం ప్రత్యేక అలంకరణ చేసి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఉదయం భక్తుల రద్దీ నెలకొంది. ఉచిత, శీఘ్ర, ప్రత్యేక, అభిషేక దర్శనాన్ని కల్పించారు. ఉచిత, శీఘ్ర దర్శనం క్యూలైన్లు రద్దీగా కనిపించాయి. మూలవిరాట్ అభిషేకాలను నిలిపివేశారు. అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలను నిర్వహించారు. సోపాన మార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ కొండ మీదకి చేరుకొని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ఆలయం వెనుక రావిచెట్టు, మహనందీశ్వరుడి వద్ద దీపాలు వెలిగించారు. ధ్యానశివుడు, నాగేంద్రుడి పుట్ట వద్ద భక్తులు పూజలు నిర్వహించారు. నరసరావుపేట నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపింది. కొండ మీద పార్కింగ్ స్థలం వాహనాలతో నిండిపోయింది. స్వచ్ఛంద సంస్థలు, దిగువ సత్రాల వద్ద ఉచిత ప్రసాద పంపిణీ నిర్వహించారు. ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు తొలిపూజలో పాల్గొన్నారు.


