నేటికీ రాని బూట్లు, సాక్స్లు, బ్యాగులు, బెల్టులు అరకొరగా యూనిఫాం అందజేత.. కుట్టుకూలీ ఇవ్వని టీడీపీ ప్రభుత్వం గత ఏడాది ఇచ్చినవి నాణ్యత లోపంతో పనికి రాకుండా పోయిన వైనం పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులకు తప్పని అప్పులు
ఎంత వ్యత్యాసమో..!
జిల్లాలో ఇదీ పరిస్థితి...
సత్తెనపల్లి: వాస్తవానికి గతంలో స్కూళ్లు తెరిచిన రోజే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందజేసి వారి ముఖంలో చిరునవ్వును నింపేవారు. అయితే ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై నాలుగు వారాలు గడుస్తున్నా వీటిని ఇవ్వలేదు. పర్యవసానంగా పిల్లలను బడిలో చేర్పించేందుకు అప్పుల కోసం పేరెంట్స్ తిప్పలు పడుతున్నారు. కార్పొరేట్ విద్యావ్యవస్థపై ఉన్న ఆసక్తిని ప్రభుత్వ స్కూళ్ల పై టీడీపీ ప్రభుత్వం చూపడం లేదు. పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువుతున్న సర్కారీ బడులపై అంతులేని నిర్లక్ష్యం చూపుతోంది. జగనన్న విద్యా కానుక పేరిట కిట్లను అందజేసే పథకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లుగా నామకరణం చేసేందుకే సర్కార్ పరిమితమైందనే విమర్శలున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభమై నాలుగు వారాలు అవుతున్నా, నేటికీ వీటిని పూర్తిస్థాయిలో అందించకపోవడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. బ్యాగులు, బూట్లు, సాక్స్లు, బెల్టులు ఇప్పటికీ పాఠశాలలకు చేరలేదు. యూనిఫామ్ అరకొరగా పంపిణీ చేసినప్పటికీ కుట్టుకూలీ ప్రభుత్వం విడుదల చేయలేదు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలను మాత్రమే పంపిణీ చేసి మమ అనిపించింది.
నమ్మించి వంచన
తల్లికి వందనం పథకం కింద సాయం ఈ నెలలో అందజేస్తామంటూ సీఎం చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. ఇందులో ఎన్ని కోతలు పెడతారోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ దీన్ని వర్తింపజేస్తామంటూ గత ఎన్నికలకు ముందు ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. నిజమని భావించి చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించారు. తన మార్కు రాజకీయాలను ఆయన అమలు చేయడంతో ఫీజుల కోసం పేరెంట్స్ అప్పులు చేశారు. సర్కారు బడుల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం బ్యాగులు, బూట్లు, బెల్టుల కోసం ఖర్చు పెట్టకతప్పని పరిస్థితి నెలకొంది. అసలే ఖర్చులు పెరిగిన ఈ కాలంలో సర్కారు నిర్వాకంతో మరింత భారం పెరిగింది.
నిజానికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో అంతా సాఫీగా జరిగేది. పాఠశాలలు పునఃప్రారంభం రోజునే అమ్మఒడితో పాటు జగనన్న విద్యా కానుక కిట్లను పూర్తిస్థాయిలో అందజేసేవారు. దీంతో తమ అభీష్టం మేరకు ఏ పాఠశాలలోనైనా తమ పిల్లలను చేర్పించే అవకాశం తల్లిదండ్రులకు ఉండేది. అయితే టీడీపీ ప్రభుత్వంలో ఈ పరిస్థితులు మచ్చుకై నా కానరావడం లేదు.
జిల్లాలో 1,213 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, 54 మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, 297 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు వెరసి 1,564 బడులు ఉన్నాయి. వీటిలో 1,40,172 మంది విద్యార్థులు చదువుతున్నారు. సర్కారీ బడుల విద్యార్థులకు యూనిఫామ్, బ్యాగులు, సాక్స్, బూట్లు, బెల్టులు, పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాలు, ఆక్ఫర్డ్ డిక్షనరీలు, పిక్టోరియల్ డిక్షనరీలను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తోంది. సగం మందికిపైగా విద్యార్థులకు ఇవి నేటికీ అందలేదు. యూనిఫామ్ 1.13 లక్షల మందికి పంపిణీ జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కుట్టుకూలీ నగదు రాలేదు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ పాఠశాలల్లో
అమలు చేసిన సంస్కరణలకు ప్రస్తుత టీడీపీ సర్కార్ తూట్లు పొడుస్తోంది. నాడు–నేడు, అమ్మఒడి, విద్యార్థులకు కిట్ల పంపిణీ నాడు సాగగా... ఇప్పుడు పేర్లు మార్చి ఆయా పథకాలపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులపై భారం మోపుతోంది.


