వైభవంగా బోనాల పండుగ
కారెంపూడి: మండలంలోని కాచవరం గ్రామంలో గ్రామ దేవతలు పోలేరమ్మ తల్లి, పాతపాటేశ్వరమ్మ అమ్మవార్ల బోనాల పండుగ ఆదివారం వైభవంగా జరిగింది. గ్రామస్తులంతా అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. మహిళలంతా నిష్టతో పొంగళ్లు (నైవేద్యం) తయారు చేసుకుని అంతా ఉమ్మడిగా ఊరేగింపుగా అమ్మవార్ల ఆలయాలకు తరలివచ్చి ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించారు. కిష్టపాటి రవీంద్రారెడ్డి, వెన్నపూసల జగన్మోహన్రెడ్డి, తెప్పాల తిరుపతిరెడ్డి, జక్కిరెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేణుగోపాలస్వామి గుడిలో చోరీ
క్రోసూరు: మండలంలోని ఆవులవారిపాలెం గ్రామంలోని వేణుగోపాలస్వామి దేవాలయంలో శనివారం రాత్రి హుండీలో నగదు చోరీ జరిగినట్లు ఎస్ఐ పి.రవిబాబు ఆదివారం తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆలయం నుంచి హుండీ బయటకు తీసుకొచ్చి పగలు కొట్టి అందులో ఉన్న నగదు దొంగిలించినట్లు తెలిపారు. ఆలయ కమిటీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ పనిచేయటం లేదన్నారు. గత ఆగస్టులో ఆలయ ప్రతిష్ట జరిగిందని, హుండీలో ఎంత ఉన్నది తెలియరాలేదని ఎస్ఐ తెలిపారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు
జంగాల
లక్ష్మీపురం: బీజేపీ అనుసరిస్తున్న విధానాలు ప్రజలను మరింత అంధకారంలోకి నెట్టివేసే విధంగా ఉన్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్కుమార్ విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ పేదలు, కార్మికులు, రైతుల హక్కులను కాలరాస్తోందని మండిపడ్డారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్రెడ్డి కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ దేశంలో కార్మిక వర్గం హక్కులను సాధించుకున్నది కమ్యూనిస్టు ఉద్యమం వల్లేనని స్పష్టం చేశారు. అనంతరం సీపీఐ గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, సీపీఐ నగర కార్యదర్శి ఆకీటి అరుణ్కుమార్ మాట్లాడారు.
గెలుపును పంచడమే
నిజమైన ఆట
విజయవాడ నగర డీసీపీ కేజీవీ సరిత
గుంటూరు ఎడ్యుకేషన్ క్రీడలంటే పతకాలు కాదని, గెలుపును పంచడమే ఆటకు నిజమైన నిర్వచనమని విజయవాడ నగర డీసీపీ కేజీవీ సరిత అన్నారు. వికాస్నగర్లోని వికాస్ క్రీడా మైదానంలో భాష్యం ఒలంపస్ పేరుతో మూడు రోజులపాటు జరిగిన వార్షిక స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న డీసీపీ సరిత మాట్లాడుతూ క్రీడలు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే శక్తినిస్తాయన్నారు. మన అనే భావన క్రీడా స్ఫూర్తి ద్వారా పెంపొందించబడుతుందన్నారు. దేశానికి వన్నెతెచ్చిన ఎంతోమంది క్రీడాకారులు మీకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఈ దిశగా విద్యార్థులను ప్రోత్సహిస్తున్న భాష్యం యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నానన్నారు. తొలుత డీసీపీ సరిత భాష్యం స్పోర్ట్స్ మీట్ జెండాలను ఆవిష్కరించి క్రీడాజ్యోతిని వెలిగించి క్రీడలను ప్రారంభించారు. విద్యార్థులు నిర్వహించిన ఓపెన్ పరేడ్ లో వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ రకాల క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు డీసీపీ సరిత చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో జెడ్ఈఓలు శివ, స్వప్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
నెహ్రూనగర్: ఆంధ్ర ప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆదివారం లాడ్జి సెంటర్లో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు. పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలో పౌర హక్కులు అడుగంటి పోతున్నాయని రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులకు నేడు తీవ్ర విఘాతం కలుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చత్తీస్ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో వేలాదిమంది పోలీసు బలగాలని అడవుల్లో దింపి అక్కడ ఆదివాసుల జీవితాలను సర్వనాశనం చేస్తుందన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయటం వంటి చర్యలను నిలిపివేయాలన్నారు. జాయింట్ సెక్రెటరీ చిన్న మాట్లాడారు.
వైభవంగా బోనాల పండుగ


