
మృతుల కుటుంబాలను మోసం చేసే కేటుగాడు అరెస్ట్
యడ్లపాడు: మృతి చెందిన వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని..బీమా డబ్బులు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని యడ్లపాడు పోలీసులు అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. స్థానిక పోలీస్స్టేషన్లో బుధవారం చిలకలూరిపేట రూరల్ సీఐ బి. సుబ్బానాయుడు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. గుంటూరు రాజీవ్గాంధీ నగర్కు చెందిన చెందిన 27 ఏళ్ల చొక్కా బాబు సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో, చనిపోయిన వారి ఇంటికి వెళ్లి తాను ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చానని నమ్మబలికేవాడు. బీమా కోసం డబ్బులు అవసరమని చెప్పి అమాయకుల నగదు స్వాహా చేసి మోసానికి పాల్పడేవాడు. తాజాగా ఈనెల 14వ తేదీన యడ్లపాడు గ్రామంలో మృతి చెందిన బండి ఆంజనేయులు ఇంటికి వెళ్లి రూ.7.5 లక్షల బీమా వస్తుందని నమ్మబలికాడు. ఇందుకు రిజిస్ట్రేషన్ ఖర్చుల నిమిత్తం రూ.28 వేలు కావాలంటూ వారి నుంచి ఫోన్పే ద్వారా వసూలు చేశాడు. అనుమానం వచ్చి బాధితులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఎస్ఐ టి. శివరామకృష్ణ కేసు నమోదు చేసుకుని కేవలం వారం రోజుల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. అతని నుంచి స్కూటీతో పాటు ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిపై గతంలోనూ పలు కేసులు ఉన్నాయి.. గుంటూరు అర్బన్ దిశ స్టేషన్లో బాలికపై లైంగికదాడి కేసు, మంగళగిరి టౌన్ స్టేషన్లో హైకోర్టు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి నుంచి రూ.59 లక్షల మోసగించిన కేసు, గుంటూరు దిశ స్టేషన్, రాజమండ్రి వన్టౌన్ స్టేషన్లలో ఆత్మహత్యాయత్నం కేసులు, గుంటూరు దిశా స్టేషన్లో నిందితుడి భార్య ఫిర్యాదుతో నమోదైన కేసులు ఉన్నాయని సీఐ వెల్లడించారు.
నవ వధువు ఆత్మహత్య
తాడేపల్లి రూరల్: తాడేపల్లి రూరల్ పరిధిలోని ఉండవల్లిలో పారాణి ఆరకముందే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లికి చెందిన రంగనాయకమ్మ (24)కు ఈ నెల 17వ తేదీన ఉండవల్లి సెంటర్లో నివాసం ఉంటున్న జితేంద్రతో వివాహం చేశారు. బుధవారం జితేంద్ర తన భార్య ఉన్న గదిలో నుంచి బయటకు వచ్చాడు. పది నిమిషాల అనంతరం తిరిగి లోనికి వెళ్లేందుకు రాగా గదికి గడియ పెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపులు కొట్టినా తీయకపోవడంతో అత్తకు చెప్పాడు. ఆమె పిలిచినా రంగనాయకమ్మ స్పందించలేదు. పక్కింటి వారి సహాయంతో జితేంద్ర తలుపులు పగలగొట్టగా.. రేకుల గదిలోని ఇనుప రాడ్కు చున్నీతో రంగనాయకమ్మ ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏడాదిగా రంగనాయకమ్మకు కడుపునొప్పి ఉండడం వల్లే వివాహానికి నిరాకరించిందని, దానివల్లే ఆత్మహత్య చేసుకుందని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఖాజావలి తెలిపారు.
వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంపు
కొరిటెపాడు: జిల్లాలో వ్యవసాయ మెగా క్రెడిట్ ఔట్ రీచ్ క్యాంప్ ‘లక్ష్య’, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాచురేషన్ క్యాంపు (జనన సురక్ష క్యాంప్)ను నగరంపాలెంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. క్యాంపును కడప రీజియన్ రీజినల్ హెడ్ ఇ. వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. లక్ష్య, ఫైనాన్షియల్ ఇంక్లూజ్ సాచురేషన్ క్యాంపునకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. క్రెడిట్ క్యాంపెయిన్ సమయంలో ఎస్హెచ్జీ గ్రూపులు, సీకేసీసీ రుణగ్రహీతలకు రుణాలు మంజూరు చేశామని తెలిపారు. కండ్లకుంట బ్రాంచ్ హెడ్ అశోక్కుమార్, సిబ్బందితోపాటు ఏపీఎం, ఇతర సీసీఏలు ఈ క్యాంపులో పాల్గొన్నారు.

మృతుల కుటుంబాలను మోసం చేసే కేటుగాడు అరెస్ట్