
చిలకలూరిపేట డిపో నుంచి హైదరాబాద్కు ఇంద్ర బస్సులు
నకరికల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లి డిపోల నుంచి రిజర్వేషన్ సౌకర్యం
చిలకలూరిపేటటౌన్: చిలకలూరిపేట డిపో నుంచి హైదరాబాదు – బీహెచ్ఈఎల్ ఏసీ బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు డీఎం ఎస్.రాంబాబు బుధవారం తెలిపారు. డిపో వినియోగదారుల అవసరాలు పరిశీలించి హైదరాబాద్, బీహెచ్ఈఎల్ మార్గాల్లో పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని కొత్తగా రిజర్వేషన్ను ప్రారంభించామన్నారు. ఇందులో భాగంగా చిలకలూరిపేట నుంచి హైదరాబాద్ (మియాపూర్, ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్) సెక్టార్లో ఇంద్ర ఏసీ బస్సులు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. పట్టణ డిపో నుంచి 7 సర్వీసులు, అక్కడి నుంచి తిరిగి వచ్చేందుకు 7 సర్వీసులు ఉన్నాయన్నారు. చిలకలూరిపేట నుంచి హైదరాబాద్కు డిపోనుంచి ఆయా సర్వీసులకు నకరికల్లు, పిడుగురాళ్ల, దాచేపల్లిలో తగినంత సీట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
రంగాకాలనీలో కార్డెన్ సెర్చ్
సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీలో బుధవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు. ఈ సందర్భంగా డీఎస్పీ హనుమంతురావు మాట్లాడుతూ రంగా కాలనీలో ఇటీవల చోటు చేసుకుంటున్న గొడవల నేపథ్యంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఉద్దేశపూర్వకంగా ఘర్షణలకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని హెచ్చరికలు చేశారు. ఒక్కసారిగా 100 మందికి పైగా పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపట్టడంతో రంగాకాలనీలో ఏదో జరిగిందంటూ కొంత సేపు కాలనీవాసులు ఉలిక్కిపడ్డారు. తనిఖీల్లో ఆయుధాలు ఏమి దొరక లేదని, ఎటువంటి కాగితాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వాటిని పోలీస్టేషన్కు తరలించారు. సబ్ డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, పాల్గొన్నారు.