నిండా మునిగి.. గుండె పగిలి.. | - | Sakshi
Sakshi News home page

నిండా మునిగి.. గుండె పగిలి..

Apr 23 2025 7:53 AM | Updated on Apr 23 2025 8:31 AM

నిండా మునిగి.. గుండె పగిలి..

నిండా మునిగి.. గుండె పగిలి..

కొద్ది రోజులుగా మనుషులతో మాట్లాడుతున్నాడేగానీ గుండె నిండా దిగులు పొరలే... చెమట చుక్కలు చిందించిన తన కష్టమే కాదు.. కన్న కొడుకు సంపాదన కూడా చిక్కుల్లో పడిందనే ఆలోచనలు కన్నీటి సుడిగుండాలై చుట్టుముట్టాయి. అనుకోనిది ఏదైనా జరిగితే, తన నమ్మకం మోసానికి బలైతే ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియక దిగులు కన్నీళ్లతో నిండిన గుండె ఉక్కిరిబిక్కిరైంది. అంతులేని ఆలోచనలతో, ఎవరికీ చెప్పుకోలేని ఆవేదనతో నరసరావుపేటలో యానిమేషన్‌ మోసానికి మంగళవారం ఓ నిండు ప్రాణం బలైంది. కుటుంబ సభ్యులకు అంతులేని వేదన మిగిల్చింది.

ప్రభుత్వానికి పట్టని

బాధితుల గోడు

నరసరావుపేట కేంద్రంగా సాయిసాధన చిట్‌ ఫండ్‌ అధినేత పుల్లారావు ప్రజల నుంచి సుమారు రూ.400 కోట్లు వసూలు చేసి కుచ్చుటోపీ పెట్టారు. దీనిపై బాధితులు రోడ్డెక్కి ధర్నాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు వినతిపత్రాలు సమర్పించారు. చివరకు సీఎం చంద్రబాబు నాయుడు వద్దకు కూడా వెళ్లి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయితే మేమున్నామని ధైర్యం చెప్పి పంపించిన వారు అనంతరం గాలికొదిలేశారు. దీంతో బాధితులు తాము ఎవరికి చెబితే న్యాయం జరుగుతుందో అర్థంగాక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. తాజాగా యానిమేషన్‌ సంస్థ కూడా సుమారు రూ.400 కోట్లకు బోర్డు తిప్పేసిందని తెలిసి, బాధితులు లబోదిబోమంటున్నారు. తాజాగా నాగేశ్వరరావు మానసిక ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి బాధితులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఆర్థిక నేరాలకు ప్రాణాలు పోతున్నా ప్రజల గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెన్ని ప్రాణాలు పోతే తమకు న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు.

నరసరావుపేటటౌన్‌: నరసరావుపేటలోని బరంపేటకు చెందిన గుండా నాగేశ్వరరావు (48) ప్రముఖ వ్యాపారవేత్త. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరిద్దరూ విదేశాల్లో స్థిరపడ్డారు. విజయవాడ కేంద్రంగా కిరణ్‌ అనే వ్యక్తి ప్రారంభించిన యానిమేషన్‌ సంస్థలో గుండా నాగేశ్వరరావు రెండేళ్లుగా పెట్టుబడులు పెడుతున్నారు. తొలుత లాభాలు రావడంతో ఏడాదిగా కుమారుడు విదేశాల నుంచి పంపుతున్న నగదుతోపాటు అప్పులు చేసి మరీ యానిమేషన్‌ సంస్థలో సుమారు రూ.10 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేశాడు. అయితే కొద్ది నెలలుగా ఈ సంస్థ బోర్డు తిప్పేయడంతో ఏమి చేయాలో అర్థంగాక, విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పే ధైర్యం లేక తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. నాలుగు రోజులుగా మరింత దిగులుగా ఉన్న నాగేశ్వరరావు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ఒక్కసారి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు గమనించేసరికి ప్రాణాలు కోల్పోయాడు.

మానసిక వేధనలో బాధితులు

యానిమేషన్‌ సంస్థలో పెట్టిన రూ.కోట్లు పోయాయని తెలుసుకున్న బాధితులు మనోవేధనకు గురవుతున్నారు. తిండి సహించక..సరిగ్గా నిద్ర పట్టక సతమతవవుతున్నారు. కోటి పెట్టుబడి పెడితే 70 శాతం వడ్డీతో రూ.1.70 కోట్లు వస్తాయన్న అత్యాశకు పోయి ఉన్న సొమ్ముతో పాటు బయట వడ్డీలకు తీసుకొచ్చి మరీ పెట్టుబడిలో పెట్టారు. అవి తిరిగి రావన్నా విషయం తెలుసుకొని లోలోపల కుమిలి పోతున్నారు. భారీ మొత్తలో సొమ్ములు పోగొట్టుకోవటంతో తీవ్ర మానసిక వేధనకు గురవుతున్నారు. అప్పులు ఇచ్చినవారికి అవి ఎలా చెల్లించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. కొందరు ఉన్న ఆస్తులు అమ్మి అప్పులోళ్లకు చెల్లిస్తుండగా, మరి కొందరు డబ్బులు చెల్లించే పరిస్థితి లేక ఐపీ పెట్టెందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ ఒత్తిడి భరించలేకే నాగేశ్వరరావు మృతి చెందాడని అతని స్నేహితులు చెప్పుకొస్తున్నారు.

‘యానిమేషన్‌’ మోసానికి వ్యక్తి బలి

సంస్థలో రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టిన నరసరావుపేట వాసి నాగేశ్వరరావు మోసపోయానని తెలిసి గుండెపోటుతో మృతి ఆందోళన చెందుతున్న బాధితులు ఆర్థిక నేరాలపై కన్నెత్తి చూడని ప్రభుత్వం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement