
పొగాకు రైతులను ఆదుకోవాలి
కాకుమాను: ఈ ఏడాది పొగాకు సాగు చేస్తున్న రైతులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పెదనందిపాడులో రైతులు పండించిన పొగాకును కృష్ణయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ధర సగానికి సగం తగ్గిందని ఆవేదన చెందారు. ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతుల కష్టాలు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరల స్థిరీకరణ నిధికి ప్రభుత్వం రూ.300 కోట్లు మాత్రమే కేటాయించిందని కనీసం రూ.5వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతుల నుంచి పంటను రూ.18వేలకు కొనాలని కోరారు. కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, కౌలు రైతు సంఘం బాపట్ల జిల్లా నాయకులు గంగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వెంకటశివరావు, దొప్పలపూడి రమేష్ బాబు పాల్గొన్నారు.