ఎస్..బాస్ అంటూ కూటమి నేతల కనుసన్నల్లో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీలకతీతంగా వ్యవహరించాల్సింది పోయి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. సామదాన దండోపాయాలను ప్రయోగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని అధికార పార్టీ నేతల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే వాటిని అమలు చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అధికార పార్టీ నేతల మెప్పు కోసం పోలీసులు పడుతున్న హైరానా పల్నాడు జిల్లాలో సంచలనంగా మారుతోంది. తాజాగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామాన్ని పోలీసులు టార్గెట్ చేశారు.
● వైఎస్సార్ సీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదు
● హత్యాయత్నం కేసులు కూడా
నమోదు చేసి వేధింపులు
● రౌడీషీట్స్ తెరచి బెదిరింపులు
● రూ.40 లక్షలు నష్ట పరిహారం చెల్లించాలని పోలీసుల ఒత్తిడి
● చెప్పినట్లు చేయకపోతే మరిన్ని కేసులు పెడతామని హెచ్చరికలు
● పోలీసుల తీరుపై హైకోర్టుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నేతలు
సాక్షి, టాస్క్ఫోర్స్ : తంగెడ గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని పోలీసులు బలవంతంగా తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారు. గ్రామంలో ఏ ఒక్క నేతను వదిలిపెట్టకుండా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒక పథకం ప్రకారం పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, నిర్బంధంపై జిల్లావ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అసలు దాచేపల్లిలో ఏం జరుగుతుందనే దానిపై ఉన్నతాధికారులు నిఘా వర్గాల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. దాచేపల్లి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ఏ క్షణంలోనైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న పోలీసులపై చర్యలు తీసుకోవచ్చుననే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదిలా ఉండగా.. పోలీసుల తీరుపై విసిగిపోయిన వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. అక్రమ కేసులను న్యాయపరంగా ఎదుర్కోవడంతో పాటుగా దశలవారీగా ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
పోలీసులపై ఒత్తిడి
పురాతన చరిత్ర కలిగిన తంగెడని పోలీసులు టార్గెట్ చేశారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల రోజున వైఎస్సార్ సీపీ, టీడీపీ నేతలు పరస్పర దాడులు చేసుకుని పెట్రోల్ బాంబులు విసురుకున్నారు. ఈ ఘటనపై వైఎస్సార్ సీపీకి చెందిన 25 మంది, టీడీపీకి చెందిన 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రావడంతో ఈ కేసును అడ్డుపెట్టుకుని మరిన్ని కేసుల్లో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించేలా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. వైఎస్సార్ సీపీ నేతలకు సంబంధంలేని వ్యవహారాలను అపాదించి, తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.
పలువురిపై అక్రమ కేసులు
తంగెడకి చెందిన వైఎస్సార్ సీపీ నేత, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దేవళ్ల వీరాస్వామితో పాటుగా వట్టె రామిరెడ్డి, దేవళ్ల నీలిమేఘం, తండా సైదా, ఉప్పు హరికృష్ణ, గోగుల హరికృష్ణ, దేవళ్ల అంకిరాజులపై కేసులు నమోదు చేసి రౌడీషీట్ ఓపెన్ చేశారు.18 రోజుల పాటు పోలీస్స్టేషన్కి పోలీసులు పిలిపించి ఇబ్బందులు పెట్టారు. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వీరు ప్రతి రోజూ స్టేషన్కి రావడం వల్ల ఆర్థికంగా చాలా నష్టపోయారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్టేషన్లో కుర్చోబెట్టి ఆ తరువాత ఇంటికి పంపించేవారు.
● తంగెడకి చెందిన వైఎస్సార్ సీపీ నేత గొగిరెడ్డి వెంకటరెడ్డి, మాదినపాటి జానీలపై కేసు నమోదు చేశారు. టీడీపీ నేత షేక్ హుస్సేన్ గొర్రెలు మేపేందుకు వెళ్లగా వెంకటరెడ్డి, జానీ చంపుతామని బెదిరించినట్లుగా సృష్టించి కేసు పెట్టారు.
● మరో వైఎస్సార్ సీపీ నేత వట్టె రామచంద్రా రెడ్డిపై ఓ ఎస్సీ మహిళతో ఫిర్యాదు ఇప్పించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఒత్తిడి చేస్తున్నారు. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీస్ ఉన్నతాధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.డివిజన్ స్థాయి పోలీస్ అధికారులు ఈ ఫిర్యాదు సరైనది కాదని పట్టించుకోకపోవడంతో గ్రీవెన్స్లో ఎస్పీకి ఫిర్యాదు చేసింది.
● ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేతలు ఆరికట్ల మల్లారెడ్డి, కాసర్ల జానకీరెడ్డి, ఉప్పుతల పెదనరసింహారావుపై టీడీపీ నేత షేక్ జాకీర్హుస్సేన్తో ఫిర్యాదు ఇప్పించి కేసు నమోదు చేయించారు. వీరితో పాటుగా మరికొంతమందిపై కేసులు పెట్టించేందుకు టీడీపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
పోలీసుల స్వామిభక్తి