‘పది’ పబ్లిక్‌ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ | - | Sakshi
Sakshi News home page

‘పది’ పబ్లిక్‌ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

Mar 17 2025 11:14 AM | Updated on Mar 17 2025 11:08 AM

జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు

నరసరావుపేట: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్‌ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉందని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాకు వివరాలు తెలియచేస్తూ...పరీక్షా కేంద్రాల వద్ద ఇన్విజిలేటర్లు, పరీక్షకు కేటాయించిన సిబ్బంది, పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులు తప్ప ఇతర వ్యక్తులు ఉండకూడదని అన్నారు. పరీక్ష కేంద్రాలకు ఎలాంటి స్మార్ట్‌ వాచ్‌, మొబైల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలకు అనుమతిలేదని అన్నారు. మాస్‌ కాపీయింగ్‌, మాల్‌ ప్రాక్టీస్‌ వంటి చర్యలకు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే విద్య నిబంధనలు ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు శాఖ తరుపున అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. పరీక్ష పేపర్లు కేంద్రాలకు తీసుకొచ్చేటప్పుడు, సమాధాన పత్రాలు తీసుకెళ్లేటప్పుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, పరీక్ష కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్‌ సెంటర్లను మూసివేయిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 128 కేంద్రాలలో పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని, పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న కేంద్రాలలో అవసరమైన వరకు బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ఎలాంటి అవకతవకలు, మాల్‌ ప్రాక్టీసుకు అవకాశం లేకుండా పకడ్బందీగా విధులు నిర్వర్తించాలని పోలీస్‌ అధికారులకు ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఏ పరీక్షా కేంద్రం వద్ద అయినా ఎటువంటి చిన్న ఘటన జరిగిన, విద్యార్థులు పరీక్షల సమయంలో అత్యవసర పరిస్థితులు ఎదురైతే సహాయం కొరకు వెంటనే డయల్‌:100/112కు సమాచారం అందించాలని కోరారు.

ఒకే కాన్పులో

ముగ్గురు జననం

గుంటూరు మెడికల్‌: హైదరాబాద్‌కు చెందిన పద్మావతి(24)కి ఐదేళ్ల కిత్రం వివాహం జరిగింది. నాటి నుంచి పిల్లలు లేక అనేక ఆసుపత్రులకు తిరిగి ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో గుంటూరు సిటిజన్‌ హాస్పిటల్‌కు చికిత్స కోసం వచ్చారు. గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ భాగ్యలక్ష్మి వైద్య పరీక్షలు చేసి సంతాన చికిత్స అందించారు. గర్భం దాల్చి ఆదివారం ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. ఇది చాలా అరుదుగా జరుగుతుందని డాక్టర్‌ భాగ్యలక్ష్మి తెలిపారు. ముగ్గురు ఆడశిశువులని, ఇరువురు 1.5 కేజీలు, ఒక శిశువు 1.4 కేజీలు ఉన్నట్లు చెప్పారు. వైద్య చికిత్సలో పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ రాజా సహకారం అంంచినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement