ఫ్యాప్టో జిల్లా చైర్మన్ రామిరెడ్డి పిలుపు
నరసరావుపేట ఈస్ట్: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోరుతూ ఫ్యాప్టో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ నెల 14వ తేదీన తలపెట్టిన జిల్లాస్థాయి ర్యాలీ, ధర్నా కార్యక్రమాలలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా ఫ్యాప్టో చైర్మన్ ఎల్.వి. రామిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ నిరసనకు పోలీస్శాఖ అనుమతి తీసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 9 గంటలకు స్టేషన్ రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా బయలుదేరి కలెక్టరేట్కు చేరుకొని ధర్నా చేపట్టనున్నట్టు వివరించారు. ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేసి చైర్మన్ నియామకం, డీఏ ప్రకటన, ఐఆర్ విడుదల, బకాయిల చెల్లింపులు, కారుణ్య నియామకాలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ తదితర డిమాండ్ల సాధన కోసం చేపట్టిన ఆందోళనలో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని గళం వినిపించాలని కోరారు. ఫ్యాప్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎం.మోహనరావు మాట్లాడుతూ.. ఉపాధ్యాయులపై బోధనేతర పనుల ఒత్తిడి తగ్గించాలన్నారు. వారిని బోధనకు పరిమితం చేయాలన్నారు. మున్సిపల్, గురుకుల, ఇతర ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఫ్యాప్టో నాయకులు బి.సంపత్బాబు, బి.శ్రీనివాసరావు, ఆర్.గోవిందరాజులు, పమ్మి వెంకటరెడ్డి, ఎ.ఏమండీ, పి.వి.భీష్మారావు తదితరులు పాల్గొన్నారు.


