పర్లాకిమిడి: రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధుల తీర్థయాత్ర పథకం కింద గురువారం ఉదయం రెండు బస్సుల్లో బృందావనానికి 73 మంది యాత్రికులను రెండు బస్సుల్లో పంపించారు. ఈ బస్సులను పర్లాకిమిడి గజపతి స్టేడియంలో ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి పచ్చజెండా ఊపి ప్రారంభించారు. గజపతి జిల్లాలో కాశీనగర్, పర్లాకిమిడి పురపాలక సంఘంలోని కొంతమంది, గుసాని, రాయగడ, మోహనా, ఆర్.ఉదయగిరిల నుంచి దరఖాస్తులు కోరగా వారిలో కొంతమందిని లాటరీ ద్వారా తీసి 73 మందిని తీర్థయాత్రకు ఎంపికచేశారు. యాత్రికులకు షుగరు, బీపీ ఇతర వ్యాధులును ఇండోర్ స్టేడియంలో పరీక్షలు చేసి వారికి మందులు, ఐడీ కార్డులు, భోజన సదుపాయాలు ఇచ్చి పంపించారు. శుక్రవారం నాడు బరంపురంలో ప్రత్యేక రైలుబండిలో బృందావనంకు బయలు దేరుతారని ఏడీఎం ఫల్గుణి మఝి తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షులు గవర తిరుపతి రావు, జిల్లా శిశు సంరక్షణ అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, టూరిజంశాఖ అధికారి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రూపేష్ మాట్లాడుతూ, వయోవృద్ధులకు వచ్చేనెల తన సొంత ఖర్చులతో పూరీ పుణ్యక్షేత్రం పంపించే ఏర్పాటు చేస్తానని ఆయన ప్రకటించారు. తీర్థయాత్రలకు వెళ్లే వయోవృద్ధుల వెంట ఇద్దరు గజపతిజిల్లాకు చెందిన అధికారులు ఎస్కార్ట్గా వెళుతున్నారు.


