భువనేశ్వర్: పూరీ శ్రీమందిరంలో భిత్తొరొ కఠొ సమీపంలో ఓ భక్తుడు వాంతి చేయడంతో బుధవారం భక్తులకు సర్వ దర్శనం తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రధాన ఆలయం లోపలి ప్రాంగణంలో అశుచి చోటు చేసుకోవడంతో ఆలయ ఆచారాలు ప్రకారం శుద్ధి తంతు నిర్వహించాల్సి వచ్చింది. దీనిలో భాగంగా సున్నపు నీటి సించనంతో శుభ్రపరిచి రత్న వేదికపై మూల విరాటులకు మహా స్నానం నిర్వహించారు. మధ్యాహ్న ధూపం తర్వాత సుమారు 2 గంటల పాటు భక్తులకు దర్శనం నిలిపివేశారు.
ఫైనాన్స్ ఉద్యోగి నుంచి రూ.70 వేలు దోపిడీ
జయపురం: బొయిపరిగుడ సమితిలో రుణాలు వసూలు చేసి జయపురం వస్తున్న ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగిని అడ్డగించి రూ.70 వేలు దోపిడీ చేసి దుండగులు పరారైన ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితుడు నరేష్ సర్దార్ బొయిపరిగుడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి 7.30 గంటల సమయంలో బురుడిపుట్–చెరకాపుట్ మార్గంలో ఓ వ్యక్తి అతివేగంగా స్కూటీపై వచ్చి నరేష్ బైక్ను ఢీకొని కత్తి చూపి దోచుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆస్పత్రిలో ఏసీలు చోరీ
రాయగడ: స్థానిక జిల్లా కేంద్రాసుపత్రి (డీహెచ్హెచ్ )లో ఐదు ఏసీలు చోరీకి గురయ్యాయి. డయాలిసిస్, కోవిడ్ వార్డుల్లో ఉన్న ఏసీలు చోరీకి గురవ్వడం సెక్యూరిటీ సిబ్బంది పనితీరును ప్రశ్నిస్తుంది. ఆదివారం నాడు రాత్రి రెండు, సోమవారం మూడు ఏసీలు వరుసగా చోరీకి గురైనట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. జిల్లా అదనపు ముఖ్యవైద్యాధికారి డాక్టర్ స్మిత పట్నాయక్ ఈ మేరకు చోరీకి సంబంధించి సదరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఏసీలను దొంగిలించిన వారు ఆస్పత్రి వెనుక ఉన్న గోడను గెంతి లోపలకు ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే రెండు రోజుల్లో వరుసగా ఏసీలు చోరీకి గురికావడం సెక్యూరిటీ సిబ్బంది పనితీరుపై పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.


