భువనేశ్వర్: బాలాసోర్ జిల్లా ఉదయపూర్ – తల్సరి అటవీ ప్రాంతంలో గుర్తించిన ఐదు ఒరాంగుటాన్ పిల్లలను భువనేశ్వర్లోని నందన్్ కానన్ జంతు ప్రదర్శనశాలకు తరలించారు. ప్రస్తుతం వాటిని క్వారంటైన్లో ఉంచారు. ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక వన్య ప్రాణుల వైద్య నిపుణులను నియమించారు. ప్రాథమిక ఆరోగ్య పరిశీలనలో వాటికి ఎలాంటి గాయాలైనట్లు కనిపించలేదని అధికార వర్గాల సమాచారం. తదుపరి వైద్య పరీక్షల కోసం వాటిని నందన్కానన్కు పంపించినట్లు పేర్కొన్నారు. ఒరాంగుటాన్లను బాలాసోర్ అటవీ ప్రాంతానికి తీసుకు వచ్చి గుట్టుగా వదిలేసినట్లు తెలుస్తోందని సమాచారం. ఆ జంతువులను ఎక్కడి నుంచి తీసుకు వచ్చారో అటవీ శాఖ ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఒడిశా తీరంలోని ఏ ప్రాంతం నుంచి ఈ ఒరంగుటాన్లను ఈ ప్రాంతంలో విడిచి పెట్టారో స్పష్టంగా తెలియడం లేదు. ఈ దిశలో దర్యాప్తు జరుగుతోందని అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రత్యేక టాస్కు ఫోర్సు ఎస్టీఎఫ్ని రంగంలోకి దింపినట్లు ప్రకటించారు. అటవీ బృందం సాధారణ గస్తీలో భాగంగా జలేశ్వర్ రేంజ్లోని ఉదయపూర్ ప్రాంతంలో ఈ ఒరాంగుటాన్లను గుర్తించిన సంగతి తెలిసిందే.


