జయపురం: జయపురంలో ఓ ఇంటి తాళాలు బద్దలుకొట్టి దొంగతనం చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పట్టణ పోలీసు అధికారి ఉల్లాస్ చంద్ర రౌత్ బుధవారం వెల్లడించారు. అరెస్టు అయిన వారిలో ఒకరు మైనర్ (బాలుడు), మిగతా వారు స్థానిక ఒడియా మేదర సాహి నివాసులు సునీల్ పొరజ ఉరఫ్ లల్లు(23), ఆకాశ్ హియాల్(19) అని తెలిపారు. పోలీసు అధికారి వివరణ ప్రకారం.. పట్టణ వాసి కె.నారాయణ రావు కుటుంబం ఈ నెల 2 నుంచి 5 తేదీ వరకు సొంత పనిపై విశాఖపట్నం వెళ్లారు. తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు విరచి ఉండటం కనిపించింది. ఇంటి లోపలికి వెళ్లి పరిశీలించగా రాగి బిందె, ఇత్తడి బిందెలు, అండాలు తదితర సామానులు కనిపించలేదు. ఇంటిలో దొంగలు పడ్డారని తెలుసుకున్నారు. 6వ తేదీన పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దొంగిలించిన వస్తువుల విలువ రూ.60 వేలకు పైగా ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసు అధికారి వెల్లడించారు. కేసు నేమోదు చేసి దర్యాప్తు జరిపిన పోలీసులు పలు ఆధారాలు సంపాదించి దొంగలను గుర్తించి అరెస్టు చేశామన్నారు. వారి నుంచి దొంగిలించిన కొన్ని వస్తువులు, దొంగతనానికి వినియోగించిన సామగ్రిని స్వాధీన పరుచుకున్నట్లు వెల్లడించారు.


