ఆమదాలవలస: ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కారణంగా రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకురాలు ఎల్.విజయ సూచించారు. మండలంలోని సైలాడ రైతు సేవా కేంద్రంలో బుధవారం ఆత్మ పథకం సౌజన్యంతో రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతీ రైతు తాము సాగు చేసిన పంటల వివరాలను ఈ –పంటలో నమోదు చేసుకోవడంతో పాటు ఈకేవైసీ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. వరిలో కలుపు యాజమాన్యం, చీడపీడల యాజమాన్యం తదితర అంశాలపై శాస్త్రవేత్త డా.జ్యోతి బసు రైతులకు సాంకేతిక సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో ఏవో మెట్ట మోహనరావు, గ్రామ వ్యవసాయ సహాయకురాలు బి.రవళి తదితరులు పాల్గొన్నారు.


