కొరాపుట్: నబరంగ్పూర్ ఎంపీ బలభద్ర మజ్జి నివాసంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని బలభద్ర అధికార నివాసంలో రాష్ట్ర బీజేపీ ఎంపీల స్నేహపూర్వక భేటీ గురువారం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర, కేంద్ర రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, కేంద్రమంత్రి జుయల్ ఓరం, ఽమాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలిమెల సమితి సుదికొండ వద్ద బుధవారం రాత్రి కలిమెల పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించారు. ఆ సమయంలో ఓ అంబులెన్స్లో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నారు. కలిమెల సమితిలోని మారుమూల గ్రామాల్లో గంజాయిను కొనుగోలు చేసిన మాఫీయా.. మహారాష్ట్రకు చెందిన అంబులెన్స్ను వినియోగించారు. పోలీసులు అంబులెన్స్ను ఆపి ప్రశ్నించగా వారి సమాధానం సరిగా లేకపోవడంతో అనుమానం వచ్చి తనిఖీ చేశారు. మృతదేహాన్ని తరలించే ప్రదేశంలో గంజాయిని దాచి మహారాష్ట్రకు తరలిస్తున్నారు. వెంటనే వాహనంలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేశారు. గిరిజనుల నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేశామని కలిమెల ఐఐసీ ప్రభుతద్త బిశ్వాల్ గురువారం తెలిపారు. పూర్తి విచారణ అనంతరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. పట్టుబడిన గంజాయి తూకం వేయగా 2 క్వింటాళ్లు ఉంది. దీని విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని పోలీసు అధికారులు తెలిపారు.
వాయుగుండంగా మారిన అల్పపీడనం
భువనేశ్వర్: పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరానికి సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా రూపాంతరం చెందింది. ఈ వాయుగుండం 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, జార్ఖండ్లను తాకనుంది. దీని ప్రభావంతో ఉత్తర ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయి. ప్రధానంగా ఉత్తర, దక్షిణ ఒడిశాలో అతి భారీ వర్షపాతాన్ని కురిపించే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం సమాచారం. రాష్ట్రంలో 17వ తేదీ వరకు వర్షాలు ఉంటాయి. మయూర్భంజ్, కెందుఝొర్, అంగుల్, ఢెంకనాల్, జాజ్పూర్, కటక్, కేంద్రాపడా పరిసర ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దక్షిణ, పశ్చిమ ఒడిశాలోని పలు జిల్లాలతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే వాతావరణం నెలకొని ఉంది. కొన్ని ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వరకు ఉండవచ్చని భువనేశ్వర్లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
కెందుఝొర్కు భారీ వర్ష సూచన..
కెందుఝొర్ ప్రాంతంలో గురు, శుక్రవారాఓ్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సుందర్గఢ్, ఝార్సుగుడ, సంబల్పూర్, దేవగడ్, మయూర్భంజ్, బాలాసోర్, అంగుల్, ఢెంకనాల్, జాజ్పూర్, మరికొన్ని జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులతోపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.
సైబర్ మోసాలపై అప్రమత్తం
పర్లాకిమిడి: ఆర్.ఉదయగిరి బ్లాక్ కందుల సాహి ఎస్.ఎస్.డి.ఉన్నత పాఠశాలలో గురువారం సైబర్ మోసాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐఐసీ కల్పలతా ప్రధాన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సైబర్ మోసాలకు గురికాకుండా మొబైల్ సెక్యూరిటీ ఇన్స్టాల్ చేయాలని, తెలియని కాల్స్ వస్తే పోలీసు ష్టేషన్లో సైబర్ విభాగానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.


