కొరాపుట్: అంతిమయాత్రకు కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ బొరిగుమ్మ సమితి బెనాసుర్ గ్రామ పంచాయతీ దుతిగుడ గ్రామానికి చెందిన ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామంలో సుమారు 500 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామానికి సమీపంలోనే శ్మశానవాటిక ఉన్నా అక్కడికి వెళ్లడానికి మార్గం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. శ్మశానానికి వెళ్లేందుకు నది, కాలువ, పొలాలు, గోతులు, కొండ దాటాల్సి వస్తోంది. దీంతో ముఖ్యంగా వర్షాకాలంలో ఎవరైనా చనిపోతే అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లాలో గత రెండు నెలలుగా వర్షాలు పడుతుండడంతో మృతదేహాల తరలింపునకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అందువలన అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇప్పటికై నా రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.


