● బాలుడి పరిస్థితి విషమం
భువనేశ్వర్: ఖుర్ధా జిల్లా జట్ని సమీపంలోని పద్మపూర్ కూడలి వద్ద జరిగిన నాటుబాంబు దాడిలో మైనర్ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరికి ఈ దాడిలో స్వల్పంగా గాయాలయ్యాయి. ఇరువర్గాల మధ్య విబేధాలు పెచ్చుమీరి ఈ పరిస్థితి తాండవించింది. నిందితులు మరియు బాధితుల మధ్య వాగ్వాదం సందర్భంగా కులం, జాతి వివక్షతో అవమానించిన విమర్శలు తాళలేక నిందితుడు ప్రత్యర్థులపై నాటు బాంబులు రువ్వినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన మైనర్ బాలుడిని తొలుత ఖుర్ధా జిల్లా ప్రధాన కార్యాలయ ఆస్పత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించడంతో ప్రత్యేక చికిత్స కోసం భువనేశ్వర్ ఎయిమ్స్కు తరలించారు. స్వల్పంగా గాయపడిన మిగతా ఇద్దరు బాధితులు స్థానికంగా చికిత్స పొందుతున్నారు. పేలుడు తర్వాత నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పిప్పిలి, ఖుర్ధా ప్రధాన రహదారిని దాదాపు రెండు గంటల పాటు దిగ్బంధించి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న జట్ని ఠాణా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిరసనకారులను శాంతింపజేసి స్తంభించిన వాహనాల రవాణా పునరుద్ధరించారు.
పూరీ దర్శనానికి ఉచిత బస్సులు
పర్లాకిమిడి: పూరీ శ్రీజగన్నాథ్ దర్శన్ పథకం కింద వయోవృద్ధులకు బస్సులను కలెక్టర్ అక్షయ సునీల్ అగర్వాల్ ఇండోర్ స్టేడియం వద్ద శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ అధ్యక్షుడు గవర తిరుపతిరావు మాట్లాడుతూ.. వయోవృద్ధులకు జగన్నాథ్ ధామ్ దర్శనాన్ని ఉచితంగా ప్రభుత్వం కల్పించడం అదృష్టమన్నారు. వృద్ధులకు ప్రయాణానికి కావాల్సిన కిట్ బ్యాగును అందజేశారు. గజపతి జిల్లా నుంచి 74 మంది రెండు ఒడిశా టూరిజం బస్సుల్లో పర్లాకిమిడి నుంచి బయలుదేరారు. కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మన్ నిర్మలా శెఠి, జిల్లా ఇన్చార్జి టూరిజం అధికారి అరుణ్ కుమార్ త్రిపాఠి, సుధీర్ సాబత్ తదితరులు పాల్గొన్నారు.


