
లారీ డ్రైవర్కు జైలుశిక్ష
ఎచ్చెర్ల : మద్యం మత్తులో లారీని నడుపుతూ ప్రమాదానికి కారణమైన విజయవాడకు చెందిన డ్రైవర్ నాగరాజుకు జిల్లా సెకెండ్ క్లాస్ మెజిస్ట్రేట్ 60 రోజుల జైలు శిక్ష విధించారు. ఎచ్చెర్ల మండలం కింతలి మిల్లు జంక్షన్ వద్ద సోమవారం అర్ధరాత్రి విజయవాడ నుంచి వస్తున్న లారీ డ్రైవర్ నాగరాజు రాంగ్రూట్లో డ్రైవ్ చేస్తూ విశాఖ నుంచి ఒడిశా వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఒడిశా లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. మద్యం మత్తులో లారీని నడిపిన డ్రైవర్ నాగరాజుపై కేసు నమోదుచేసి కోర్టుకు తరలించగా 60 రోజులు జైలు శిక్షను విధించారని ఎస్సై సందీప్కుమార్ మంగళవారం తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితురాలు
మెళియాపుట్టి: పట్టుపురంలో కాంచనే అనే మహిళపై దాడి చేసి పారిపోయిన ఘటనలో అనుమానితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు పాతపట్నం సీఐ వి.రామారావు తెలిపారు. పూర్తి వివరాలు బుధవారం తెలియజేస్తామన్నారు.
రాత్రిపూట యూరియా అమ్మకాలా?
నరసన్నపేట: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటైన సొసైటీల్లో చీకటి పడ్డాక యూరియా అమ్మకాలు చేస్తుండటం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నరసన్నపేట సొసైటీకి మూడు రోజుల కిందట 400 బస్తాల యూరియా వచ్చింది. ఆదివారం రైతులు అధికంగా చేరడం.. వాగ్వాదం జరగడంతో యూరియా పంపిణీ చేయలేదు. రెండో రోజు కొంత మంది రైతులకు ఒక్కో బస్తా చొప్పున ఇచ్చారు. మిగిలిన యూరియాను మంగళవారం రాత్రి విక్రయాలు చేపట్టారు. ఆటోలు, లగేజి వాహనాల్లో బస్తాలను ఇష్టానుసారంగా సరఫరా చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు ఇవ్వాల్సిన యూరియా పక్కతోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవసాయ అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడంతో సొసైటీకి వచ్చిన యూరియా పక్క దారి పట్టిందని, కావాల్సిన వారికి లెక్కకు మించి పంపిణీ చేశారని పలువురు రైతులు అంటున్నారు.
అభ్యంతరాల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ–డివిజనల్ మేనేజర్ పోస్టు రాత పరీక్ష ఆగస్టు 10న నిర్వహించగా.. ఫలితాలు, ప్రొవిజనల్ జాబితా జిల్లా వెబ్సైట్ srikakulam.a p.gov.inలో ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యంతరాలను ఈ నెల 22లోగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. మార్కులపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా నిర్దేశిత తేదీ సాయంత్రం 5 గంటల లోగా శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ అధికారికి నేరుగా తెలియజేయవచ్చని తెలిపారు.