
తప్పిన పెను ప్రమాదం
పొందూరు : మండల కేంద్రంలోని పొందూరులో మానసవేణి పాఠశాల విద్యార్థులను తీసుకెళ్తున్న ఆటో శుక్రవారం ప్రమాదానికి గురైంది. 20 మందికి పైగా విద్యార్థులను ఎక్కించడంతో ఒరిగిపోయిందని స్థానికులు చెబుతున్నారు. బోల్తా కొట్టుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అంటున్నారు.
పుస్తెలతాడు చోరీ
టెక్కలి రూరల్: కోటబొమ్మాళి మండలం నరసాపురం జంక్షన్ వద్ద గురువారం సాయంత్రం ఓ మహిళ మెడలో పుస్తెలతాడును దుండగులు తెంచుకుపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతబొమ్మాళి మండలం బడేకుప్పన్నపేటకు చెందిన బొమ్మాళి దాలమ్మ కోటబొమ్మాళిలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి నడుచుకుంటూ వస్తుండగా గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడు తెంచుకుని పరారయ్యారు. బాధితురాలు కోటబొమ్మాళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
20 కేజీల గంజాయి స్వాధీనం
పలాస: ఒడిశాకు చెందిన నలుగురు గంజాయి అక్రమ రవాణాదారులను పలాస రైల్వే స్టేషన్లో అరెస్టు చేసినట్టు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. నిందితులు మోహనా బ్లాక్ పడొవ గ్రామానికి చెందిన అనిసెంటు నాయక్ , రాహిత్ బిర, జునైలు, గుమ్మా గ్రామానికి చెందిన సురుసింగ్గా గుర్తించామని, వీరి వద్ద 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వీరిని అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో జైలుకు పంపించామన్నారు.
బైక్ ఢీకొని వ్యక్తి మృతి
పలాస: మోదుగులపుట్టి వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ శుక్రవారం చెప్పారు. నందిగాం మండలం జడ్యాడ గ్రామానికి చెందిన కంబకాయల దుర్యోధన టెక్కలిపట్నం బజారుకు వెళ్లి తిరిగి వస్తుండగా మోదుగులపుట్టి వద్ద వెనుక నుంచి వచ్చిన బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బలమైన గాయాలు కావడంతో కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా మృతి చెందాడు. దుర్యోధన కుమారుడు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చెప్పారు.
సైబర్ మోసాలపై
అప్రమత్తంగా ఉండాలి
పొందూరు: సైబర్ మోసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సత్యనారాయణ సూచించారు. మండలంలోని వావిలపల్లిపేట కూడలికి సమీపంలో ఉన్న ఒక ప్రైవేటు స్కూల్లో శక్తి యాప్పై శుక్రవారం అవగాహన కల్పించారు. వ్యక్తిగత ఖాతాల నుంచి నగదు డిబిట్ అయినట్లయితే వెంటనే 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. అలాగే బాల్య వివాహాలు జరగకుండా రక్షణ కల్పించేందుకు 1098 ఫోన్ చేయాలన్నారు. ఆపదలో ఉన్నప్పుడు మహిళలు శక్తి యాప్ను వినియోగించుకొని రక్షణ పొందాలని సూచించారు. మాస్కులు ధరించి వాహనాలు నడిపిన వారిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పీవీవీ శేషుకుమార్, హెచ్ఎం నీలిమ తదితరులు పాల్గొన్నారు.
రహదారి విస్తరణలో వివక్షత
సరుబుజ్జిలి: సరుబుజ్జిలి జంక్షన్లో నాలుగువైపులా రహదారుల విస్తరణలో అధికారులు వివక్షత ప్రదర్శిస్తున్నారని పలువురు వాపోతున్నారు. కొలతలు వేసే సమయంలో రహదారి మధ్య భాగం నుంచి రెండువైపులా సమానంగా మార్కింగ్ చేయాలి. కానీ అలా కాకుండా కొంతమంది నేతల ఒత్తిళ్ల మేరకు ఒక్కోచోట ఒక్కోవిధంగా సంబంధిత యంత్రాంగాలు భూమిని మార్కింగ్ చేస్తున్నాయని తెలిపారు. దీనివలన విలువైన జిరాయితీ భూములను కోల్పోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు. అధికారులు రహదారి విస్తరణ సమయంలో సమన్యాయంతో వ్యవహరించాలని కోరుతున్నారు.

తప్పిన పెను ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం