
రాష్ట్రంలో అకాల వర్షాలు
● 9 జిల్లాలకు ఐఎండీ నారింజ
రంగు, 21 జిల్లాలకు
పసుపు రంగు హెచ్చరిక జారీ
భువనేశ్వర్: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రాంతీయ కేంద్రం రాష్ట్రంలోని 30 జిల్లాల్లో వర్ష సూచన జారీ చేసింది. 9 జిల్లాలకు నారింజ, 21 జిల్లాలకు పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మే నెల 1వ తేదీ వరకు ఈ వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పగటి పూట ఉష్ణోగ్రత 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ తగ్గుతుందని భావిస్తున్నారు.
నారింజ హెచ్చరిక
సుందర్గఢ్, కెంజొహర్, మయూర్భంజ్, బాలాసోర్, భద్రక్, గజపతి, గంజాం, రాయగడ మరియు కొరాపుట్ జిల్లాల్లో మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. ఉపరితల గాలుల వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లకు చేరుకుంటుంది. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలతో కూడిన వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉంది.
పసుపు హెచ్చరిక
జాజ్పూర్, కేంద్రాపడా, కటక్, జగత్సింగ్పూర్, ఝార్సుగుడ, బర్గడ్, సంబల్పూర్, దేవ్గడ్, అంగుల్, ఢెంకనాల్, పూరీ, ఖుర్దా, నయాగడ్, సోన్పూర్, బౌధ్, నువాపడా, బొలంగీర్, కలహండి, కంధమల్, నవరంగ్పూర్, మల్కన్గిరి జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన కురిసే అవకాశం ఉంది.