గిరిజన కాంట్రాక్టర్ రాజు నాయక్ ఆవేదన
లబ్బీపేట(విజయవాడతూర్పు): తాను చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించకుండా మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అనుచరుడు, కాంట్రాక్టర్ పామర్తి రాజా తనను కులం పేరుతో దూషిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని కాంట్రాక్టర్ రాజు నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తాను కాంట్రాక్టర్ పామర్తి రాజా వద్ద కొన్నేళ్లుగా పెట్రోల్ బంక్ల నిర్మాణ పనులు చేస్తున్నానని తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోనిలో పెట్రోల్ బంక్ నిర్మాణ పనులు చేపట్టి 40 శాతం పూర్తి చేసిన తర్వాత ఎన్వోసీ ఇచ్చేందుకు కలెక్టర్ నిరాకరించారన్నారు. దీంతో హై కోర్టు, కర్నూలు కలెక్టరాఫీస్, ఆదోని కార్యాలయాల చుట్టూ తిరిగి స్వయంగా ఎన్వోసీ తెచ్చినట్లు పేర్కొన్నారు. అయితే తనను పక్కన పెట్టి, వేరే వారితో పనులు చేయించుకున్నారని, రూ.88 లక్షల బిల్లులు పెట్టి, అందులో తనకు ఒక్క రూపాయి ఇవ్వలేదని ఆరోపించారు. తనకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ గురించి అడిగేందుకు ఫోన్ చేస్తే బెదిరింపులకు దిగారని, తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తాను ఒక గిరిజనుడిననే నెపంతో పామర్తి రాజా ఇబ్బంది పెడుతున్నాడని, తన కులాన్ని, తల్లిని, జాతిని, పుట్టుకను కించపరి చారని వాపోయారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. తనకు రూ.1.30 కోట్లకు పైగా బకాయిలు రావాలని, ఇల్లు, బంగారం కుదువబెట్టి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం మంత్రి కొల్లు రవీంద్రకు చెప్పానని, త్వరలో గిరిజన సంక్షేమ మంత్రి సంధ్యారాణిని కలుస్తానని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. గిరిజన కుల పెద్ద నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): అనుమానాస్పదంగా యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఎస్ఎన్పురం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు.. కట్టా దినేష్ మణికంఠ (29) నగరపాలక సంస్థలో డేటా ప్రాసెసింగ్ సెక్రటరీగా పనిచేస్తూ కుటుంబ సభ్యులతో కలసి ఖుద్దుస్నగర్, స్టార్ బిల్డింగ్ రోడ్డులో నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి తండ్రి తిమోతి రాజుతో కలసి బెంజిసర్కిల్ వద్ద ట్రెండ్సెట్లో సెకండ్ షో సినిమా చూసి ఇంటికి వచ్చారు. అనంతరం ఎవరి గదులకు వారు వెళ్లి నిద్రించారు. బుధవారం ఉదయం డ్యూటీ టైమ్ అవుతున్నా మణిఖంఠ నిద్రలేవక పోవడంతో తిమోతిరాజు అతని గదికి వెళ్లాడు. మణి కంఠ ఫ్యాన్కు దుప్పటితో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే మణికంఠను కిందకి దింపి 108కి ఫోన్ చేయగా వారు వచ్చి చూసి మృతి చెందాడని నిర్ధారించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


