వెయ్యి మందికిపైగా బాధితుల నుంచి ఫిర్యాదులు కోర్టులో లొంగిపోయినసంస్థ ఎండీ పసుపులేటి అంకుశం
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్)/విజయవాడలీగల్: స్థానిక సత్యనారాయణపురం కేంద్రంగా ఏర్పాటైన మాషా అల్లా ఎంటర్ప్రైజెర్స్ బాధితుల సంఖ్య వెయ్యికి పైగా చేరింది. సంస్థ ఎండీ పసుపులేటి అంకుశం ఎక్కడిక్కడ ఏజెంట్లను నియమించుకుని స్క్రబ్బర్ల తయారీ, డ్రైఫ్రూట్స్ ప్యాకింగ్, నాటుకోళ్ల పెంపకం వంటి వ్యాపారాల పేరుతో నగదు వసూలు చేశాడు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకుని రూ.కోట్లు దండుకుని బోర్డు తిప్పేసిన ఘటన తెలిసిందే. ఈ కేసులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు నాలుగు వేల మంది బాధితుల నుంచి రూ.100 కోట్లకు పైగానే అంకుశం వసూలు చేసినట్లు సమాచారం. ఈ సంస్థ బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం ఒక్క రోజే సుమారు 400 మంది బాధితులు ఫిర్యాదు చేసేందుకు సత్యనారాయణ పురం పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఫిర్యాదు చేసిన బాధితుల సంఖ్య వెయ్యి దాటింది. వారి నుంచి ఫిర్యాదులు నమోదు చేసేందుకు పోలీసులు ప్రత్యేకంగా నాలుగు కౌంటర్లను ఏర్పాటు చేశారు. భారీగా వస్తున్న బాధితులకు టోనెన్లు ఇచ్చి వరుస క్రమంలో ఫిర్యాదులు నమోదు చేస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం మాషా అల్లా సంస్థ ఎండీ పసుపులేటి అంకుశం విజయవాడలోని రెండో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులో లోంగిపోయాడు. ఈ విషయం తెలియడంతో తాము కట్టిన డబ్బులు వస్తాయో లేదోనని బాధితులు వాపోతున్నారు. పసుపులేటి అంకుశంనకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. కోర్టు వద్ద పసుపులేటి అంకుశం భార్య సుమాను సత్యనారాయణ పురం పోలీసులు అరెస్టు చేశారు.


