● డీఎస్సీ అవకతవకలకు మంత్రి లోకేష్
బాధ్యత వహించాల్సిందే
● వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో
రిలే నిరాహార దీక్షలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): మెగా డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాల్సిందేనని వైఎస్సార్ సీపీ శ్రేణులు గళమెత్తాయి. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టే.. లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టాయి.
● డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్ సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని రాణీగారితోటలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ దీక్షా శిబిరాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ లక్ష్మీపార్వతి ప్రారంభించగా, పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పాల్గొన్నారు. సాయంత్రం వీఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విద్యాధరపురం మర్రిచెట్టు సెంటర్లో ఉదయం 10.30 గంటలకు రిలే దీక్షను నియోజకవర్గ సమన్వయకర్త వెలంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ అసిఫ్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
● విజయవాడసెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో డీఎస్సీ అక్రమాలపై విచారణ, మంత్రి రాజీనామా కోరుతూ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. దీక్ష ప్రారంభించి నాయకులు ప్రసంగిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తన అనుచరులతో వచ్చి శిబిరం వద్ద టెంట్ పీకివేశారు. పోలీసులు మల్లాది విష్ణును అరెస్ట్ చేసి ధర్నా చౌక్కు తరలించారు.
● తాడిగడప మునిసిపాలిటీ యువజన విభాగం అధ్యక్షుడు మరీదు వినయ్ ఆధ్వర్యంలో యనమలకుదురులో గురువారం రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. పెనమలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఇతర నాయకులు పాల్గొన్నారు.
● గన్నవరం మూడు బొమ్మల సెంటర్లో పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అనగాని సుందరచైతన్య, పల్లి వీరయ్య నేతృత్వంలో దీక్ష శిబిరాన్ని జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజబెత్రాణి ప్రారంభించారు.


