అందుకే అమరావతి అంటే విజయవాడ, గుంటూరని కొత్తపాట వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన మావిగన్తో ముఖ్యమంత్రి చంద్రబాబుకు షాక్ తగిలిందని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. అందుకే అమరావతి అంటే విజయవాడ, గుంటూరు అని కొత్తపాట అందుకున్నారని ఎద్దేవాచేశారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. తమకు దూరంగా ఉన్న ప్రాంతం కాకుండా తాము నివసించే ప్రాంతంలో రాజధాని ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్, గన్నవరం ఎయిర్పోర్టు గురించి ఏనాడూ మాట్లాడని చంద్రబాబు, ఇప్పుడు ఆ రెండూ రాజధానిలో భాగం అంటున్నాడని పేర్కొన్నారు. అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, భూమి ధరలు పెరిగితే విక్రయించి అప్పులు తీరుస్తా మని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే అమరావతి పేరులో రూ.47 వేల కోట్లు ఖర్చు చేశారని, ఈ అప్పునకు సంబంధించి తొలి ఇన్స్టాల్మెంట్గా రూ.200 కోట్లు చెల్లించారని వివరించారు. ఈ భారమంతా రాష్ట్ర ప్రజలపై పడుతోందని అవినాష్ ఆందోళన వ్యక్తంచేశారు.
అమరావతిలో పేదలు ఉండకూడదా?
పేదలు అమరావతిలో ఉండకూడదని చంద్ర బాబు చెబుతున్నారని అవినాష్ విమర్శించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలో 51 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, 1,400 ఎకరాలు మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేసిన గొప్ప నాయకు డని పేర్కొన్నారు. అక్కడ బడుగు, బలహీన వర్గాలు ఉండకూడదని ఆ ఇళ్ల స్థలాలను చంద్రబాబు రద్దు చేశాడని గుర్త్తుచేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపా రులు, తన బినామీలు ఉండేలా చంద్రబాబు ప్రణాళిక రచించినట్లు విమర్శించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0లో అమరావతిలో ఒక్కరికీ ఆమోదం లభించలేదన్నారు. అమరా వతి అందరిదీ అయితే ఎందుకు ప్రతిపాదన పంప లేదని ప్రశ్నించారు. మహిళలకు చంద్రబాబు ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు.
ప్రతి రాయిపై జగన్ పేరు
భోగాపురం ఎయిర్పోర్టులో ప్రతి రాయిపై వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు ఉంటుందని దేవినేని అవినాష్ అన్నారు. ఆ ఎయిర్ పోర్టు పనులు మొదలు పెట్టిందే వైఎస్ జగన్మోహన్రెడ్డి అని గుర్తుచేశారు. వైఎస్ జగన్ ఎంతో ముందు చూపుతో మావిగన్ ప్రతిపాదన చేశారన్నారు. 2029లో ఈ ప్రతిపాదనకు ప్రజలు మద్దతు ఇస్తారని, గుంటూరు, విజయవాడ ప్రాంత ప్రజలు అండగా నిలుస్తారని పేర్కొన్నారు. పాలన ఏ విధంగా చేయాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని చూసి కూటమి నేతలు తెలుసుకోవాలన్నారు.


