పద్మశ్రీ డాక్టర్ శోభారాజు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఉపనిషత్తులు జ్ఞాననిలయాలని ప్రముఖ గాయని, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభారాజు పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ కోదాటి వియ్యన్నరావు రచించిన ‘ఉపనిషత్ ఉద్యానవనమ్’ గ్రంథావిష్కరణ సభ శనివారం కేబీఎన్ కళాశాలలో శనివారం జరి గింది. ముఖ్య అతిథి డాక్టర్ శోభారాజు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. ధైర్యం, క్రమశిక్షణ, ఆత్మనిగ్రహం వంటి మహోన్నత విలువలను యువతలో పెంపొందించే అపూర్వ శక్తి ఉపనిషత్తులకు ఉందన్నారు.ఆధునిక యువత సులభంగా గ్రహించే శైలిలో ఉపనిషత్తుల సారాన్ని అందించిన డాక్టర్ వియ్యన్నరావు తెలుగు సాహిత్యానికి విశిష్ట సేవ చేశారని ప్రశంసించారు. హిందూ హైస్కూల్స్ పరిపాలనాధి కారి డాక్టర్ వి. నారాయణరావు మాట్లాడుతూ.. ఉపనిషత్తులు జాతి, మత, కుల, ప్రాంత పరిమితులను అధిగమించి విశ్వమానవ, సర్వజన హితాన్ని ప్రతిపాదించే మహోన్నత గ్రంథాలుగా పేర్కొన్నారు. కళాశాల కార్యదర్శి టి.శ్రీనివాసు మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో పెరుగుతున్న నిరాశ, భయం, ఒత్తిడి వంటి మానసిక సమస్యలను అధిగమించేందుకు ఉపనిషత్తులు అందించే సానుకూల జీవన దృక్పథం అత్యంత అవసరమన్నారు.
గ్రంథ రచయిత డాక్టర్ కోదాటి వియ్యన్నరావు మాట్లాడుతూ.. యువతలో భారతీయ తాత్విక సంపదపై అవగాహన పెంపొందించి, నైతిక విలువల పునరుద్ధరణ లక్ష్యంతోనే ’ఉపనిషత్ ఉద్యానవనమ్’ గ్రంథాన్ని రచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జి.కృష్ణవేణి, వైస్ ప్రిన్సిపాల్ పి.ఎల్.రమేష్ తదితరులు పాల్గొన్నారు.


