గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూటమి పాలనలో నిర్వహించిన డీఎస్సీ 2025 అక్రమాల పుట్టగా మారిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని చంద్రబాబు సర్కార్ను వైఎస్సార్ సీపీ నేతలు డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ పిలుపు మేరకు డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిపించాలని, మంత్రి రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో డీఆర్వో లక్ష్మీనరసింహంకు నేతలు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆ పార్టీ నేతలు నేతలు మీడియాతో మాట్లాడారు. పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పాను గంటి చైతన్య మాట్లాడుతూ పేకాట, టగ్ ఆఫ్ వార్ ఆడిన వారికి డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. స్పోర్ట్స్ కోటాలో జీవో నంబర్ 77 ప్రకారం డీఎస్సీ పరీక్ష రాయాలి.. కానీ జీవోను మార్చి డీఎస్సీతో సంబంధం లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారన్నారు. టీడీపీ నేతలు కూన రవికుమార్, లోకేష్ తోడల్లుడు భరత్రామ్ క్రీడా అసోసియేషన్ల నుంచి సర్టిఫికెట్లు ఇచ్చి ఉద్యోగాలు కట్టబెట్టారన్నారు. జరిగిన అవినీతిని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో నిరూపించారన్నారు. నీట్ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలన్నారు.
యువతకిచ్చిన హామీలు ఏమయ్యాయి
● పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ మెగా డీఎస్సీని దగా డీఎస్సీ చేశారని, కమీషన్ల కోసం కక్కుర్తిపడి భారీఎత్తున అవినీతికి పాల్పడ్డారన్నారు. రాష్ట్రంలోని యువత తమకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని, డీఎస్సీ అక్రమాలపై ప్రశ్నిస్తున్నారన్నారు. లోకేష్ రాజీనామా చేయాలని యువత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తోందన్నారు. దీనిపై వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆగస్టు 3, 4 తేదీల్లో టౌన్ హాలు సమావేశాలు, 6 నుంచి 9వరకు రిలే దీక్షలు, 10న ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. కూటమి నేతలకు పరిపాలన చేతకాకపోతే వైఎస్ జగన్ను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.
● మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ డీఎస్సీ అంతా పారదర్శకంగా జరిగిందని చెబుతున్న ప్రభుత్వం సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
● మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు మాట్లాడుతూ డీఎస్సీని మెగా స్కామ్గా మార్చేశారన్నారు. జెన్ జీ తలచుకుంటే ఈ ప్రభుత్వం మెడలు వంచుతుందన్నారు. రాష్ట్ర భవిష్యత్కు ఉద్యమించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి జెన్ జీకి పిలుపునిచ్చారన్నారు.
● మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ డీఎస్సీ మొత్తం స్కామ్లతో నిండిపోయిందన్నారు. స్పోర్ట్స్ కోటాలో వారికి కావలసిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చారన్నారు. డీఎస్సీ అక్రమాలపై విచారణకు ఆదేశించాలన్నారు.
● తిరువూరు సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాసు, జగ్గయ్యపేట సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, అధికార ప్రతినిధి వేల్పుల రవికుమార్, నియోజకవర్గాల పరిశీలకులు అవుతు శ్రీనివాసరెడ్డి, ఆళ్ల చెల్లారావు, గౌస్ మొహిద్దీన్, కర్నాటి రాంబాబు, వేములకొండ తిరుపతిరావు, విద్యార్థి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కొరివి చైతన్య, విద్యార్థి విభాగం అధ్యక్షుడు కోమల సాయి తదితరులు పాల్గొన్నారు.
నారా లోకేష్ మంత్రి పదవి
నుంచి వైదొలగాలి
డీఎస్సీలో అంతులేని అక్రమాలు
ఫీజు రీయింబర్స్మెంట్,
నిరుద్యోగ భృతి చెల్లించాలి
కలెక్టరేట్లో డీఆర్వోకు వినతి పత్రం
అందజేసిన వైఎస్సార్ సీపీ
ఎన్టీఆర్ జిల్లా నేతలు


