ఆత్కూరు (గన్నవరం): నవభారత నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, అందుకు అనుగుణంగా నైపుణ్యాలను, దేశభక్తి, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్లో గురువారం మన్నె శ్రీనివాసరావు రచించిన ‘కర్మవీరులారా కదలి రండి’ దేశభక్తి ప్రబోధాత్మక గీతాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్లో శిక్షణ పొందుతున్న యువతతో ముఖాముఖాలో ప్రసంగించారు. నైపుణ్యం కలిగిన యువత మాత్రమే నవభారతాన్ని సమగ్రంగా నిర్మించగలరని చెప్పారు. ముఖ్యంగా మారుతున్న శాస్త్ర, సాంకేతిక ప్రగతికి అనుగుణంగా యువత నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవడం తప్పనిసరిగా పేర్కొన్నారు. కేవలం వృత్తిపరమైన నైపుణ్యాలే కాకుండా జీవితంలో క్రమశిక్షణ, మానవీయ విలువలు చాలా ముఖ్యమన్నారు.


