అధికారుల నిరంతర పర్యవేక్షణ..
తిరువూరు: జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువులు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఏవైనా సమస్యలుంటే తనకు నేరుగా ఫోన్ చేయవచ్చని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. గురువారం తిరువూరులో ఎరువుల దుకాణాల్లో స్టాకును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఎరువులకు ఎటువంటి ఇబ్బందీ లేదని, ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా పారదర్శకంగా పంపిణీ జరుగుతోందని కలెక్టర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ, తనిఖీలు నిర్వహిస్తున్నామని, ఇంకా ఏవైనా ఇబ్బందులు ఉంటే 91549 70454 నంబరుకు నేరుగా ఫోన్ చేస్తే తాను పరిశీలిస్తానన్నారు. జిల్లాలో సహకార సంఘాల ద్వారా 3,319టన్నులు, ప్రైవేటు డీలర్ల ద్వారా 4,866టన్నుల యూరియా అందుబా టులో ఉందని కలెక్టర్ తెలిపారు. పీఏసీఎస్లలో 816 టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 773 టన్నుల డీఏపీ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు.
వరి పైర్ల పరిశీలన..
వామకుంట్ల(తిరువూరురూరల్): మండలంలోని వామకుంట్లలో గురువారం కలెక్టర్ లక్ష్మీశ ఖరీఫ్ వరి పైర్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఆరుతడి పంటలు, తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను సాగు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎరువుల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నానో యూరియాకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొ న్నారు. కార్యక్రమంలో తిరువూరు ఆర్డీవో కుమార్, తహసీల్దారు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ
ఎరువుల సరఫరాలో ఎటువంటి లోపాలు లేకుండా మండల వ్యవసాయాధికారులు ప్రతి రోజూ రెండు మూడు దుకాణాలను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తిరువూరు సమీపంలో తెలంగాణ సరిహద్దు చెక్పోస్టు వద్ద ఎరువుల అక్రమ రవాణా నిరోధానికి వ్యవ సాయ మార్కెటింగ్ శాఖ నిర్వహిస్తున్న తనిఖీలను ఆయన పరిశీలించారు. రైతులు కూడా అవసరం మేరకే యూరియా, డీఏపీ కొనుగోలు చేయాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వేయాల్సిన పంటలపై అధికారులు అవగాహన కల్పించాలన్నారు. రైతులతో కూడా కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన వెంట తిరువూరు ఆర్డీవో ఏ కుమార్, తహసీల్దార్ చంద్రమౌళి, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.


