వేణుగోపాలుని హుండీ ఆదాయం రూ.17.52లక్షలు
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నెమలి శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ హుండీల్లోని కానుకలను బుధవారం లెక్కించినట్లు సహయ కమిషనర్ ఎన్. సంధ్య తెలిపారు. ఆరు హుండీలలో రూ. 17,38,791 రాగా, అన్నదానం హుండీలలో రూ. 13,488 వచ్చినట్లు చెప్పారు. బంగారం 5.8గ్రాములు, వెండి 92. 400గ్రాములు, యూఎస్ఏ డాలర్లు 175, సింగపూర్ డాలర్లు 10 ఉన్నట్లు తెలిపారు. లెక్కింపులో ఆలయ చైర్మన్ కావూరి శశిరేఖ పాల్గొన్నారు.
జగ్గయ్యపేట: పట్టణంలో తాచు పాము హాల్చల్ చేసింది. శాంతి నగర్కు చెందిన కిషోర్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో ఓ చెట్టు పొదలో బుసలు కొడుతూ ఉన్న పామును చూశారు. దీంతో స్నేక్ క్యాచర్ సుధాకర్కు సమాచారం ఇవ్వగా వెంటనే ఆయన పామును చాకచక్యంగా పట్టుకున్నారు. తాను ఎప్పుడూ ఇలాంటి తాచును చూడలేదని ఐదు అడుగుల పొడవు గల తెల్లటి ఈ పాము చంద్రనాగు జాతికి చెందినదిగా సుధాకర్ తెలిపారు. అనంతరం పామును సమీపంలోని బుదవాడ అటవి ప్రాంతంలో వదిలి వేశారు.
వన్టౌన్(విజయవాడపశ్చిమ): ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) నిర్వహించే బీఎడ్, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల జనవరి–2026 సెషన్కు, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ (పీజీడీఆర్సీ) కోర్సు జూలై–2026 సెషన్కు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం రీజనల్ డైరెక్టర్ డాక్టర్ కె. సుమలత తెలిపారు. విజయవాడ ప్రాంతీయ కేంద్రం పరిధిలో మాత్రమే ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి బీఎడ్, ప్రవేశ పరీక్షకు ఫిబ్రవరి 27, అలాగే బీఎస్సీ నర్సింగ్, పీజీ డిప్లొమా ఇన్ రిహాబిలిటేషన్ సైకాలజీ కోర్సుల ప్రవేశ పరీక్షకు మార్చి 5 ఆఖరు తేదీగా యూనివర్సిటీ నిర్ణయించిందని పేర్కొన్నారు. అర్హతగల అభ్యర్థులు ఇగ్నో వెబ్సైట్లో దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఇతర వివరాలకు విజయవాడ కొత్తపేట హిందూ హైస్కూల్ ప్రాంగణంలో గల ఇగ్నో ప్రాంతీయ కేంద్రాన్ని గాని లేదా దగ్గరలోని ఇగ్నో అధ్యయన కేంద్రాన్ని లేదా 0866–2565253లో సంప్రదించాలని కోరారు.
వెంగనాయకునిపాలెం(పెనుగంచిప్రోలు): ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని వెంగనాయకునిపాలెంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ముళ్లగిరి సురేష్(38) అనే వ్యవసాయ కూలీ అప్పుల బాధతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తొలుత నందిగామ, ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బుధవారం పోస్టుమార్టమ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
వేణుగోపాలుని హుండీ ఆదాయం రూ.17.52లక్షలు


