రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలి
ఇబ్రహీంపట్నం: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కావాలనే అక్రమ కేసులు, దాడులతో రాక్షస పాలన సాగిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా అన్నారు. రాష్ట్రంలో ప్రజా స్వామ్యం మంట కలుపుతున్న వేళ గవర్నర్ జోక్యం చేసుకుని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని ఆయన కోరారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వైఎస్సార్ సీపీ నేత, మాజీమంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో బుధవారం అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రుహుల్లా, మాజీమంత్రి ఉషశ్రీ చరణ్ విడివిడిగా జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకుని అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పరిశీలించారు. అనంతరం అంజాద్ బాషా, ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయని ఆరోపించారు. పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాటిళ్లతో దాడిచేయడం ఉగ్రవాదుల చర్య అని అన్నారు. దాడి జరిగిన వీడియోలు చూస్తే పక్కా ప్రణాళికతో దాడి జరిగినట్లు తెలుస్తోందన్నారు. అంబటి రాంబాబు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా


