భూమాతను కాపాడుకోవాలి
అయోధ్య(మోపిదేవి): మానవ, జంతు, పక్షుల వంటి సకల జీవరాశులకు మాతృమూర్తి భూ మాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. మోపిదేవి జెడ్పీ పాఠశాల ఆవరణ నుంచి అయోధ్య గ్రామం వరకు సుఫల రైతు పాదయాత్ర బుధవారం చేపట్టారు. అందులో భాగంగా ఉదయం ఆయన సందేశమిస్తూ అన్ని రకాల సుఖాలు అందిస్తున్న భూమాతను ఆనందింపజేయాల్సి ఉందన్నారు. దీనికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి సన్నిధి నుంచి మోపిదేవిలంక, నడిమిలంక, కోసూరువారిపాలెం, మేళ్లమర్తిలంక, ఉత్తరచిరువోలులంక గ్రామాల మీదగా సుమారు 8 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి అయోధ్య చేరుకున్నట్లు తెలిపారు. మచిలీపట్నం సమీపంలోని తరకటూరులో పూర్తి ఆర్గానిక్స్ సాగుతో అత్యధిక ఆదాయం పొందుతున్న విజయారావ్ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు, అధికారులు, రైతులు పాదయాత్రలో పాల్గొన్నారు.
త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి


