International Workers Memorial Day: ప్రాణాలతో గల్ఫ్ కు ఎగుమతి.. శవపేటికల్లో దిగుమతి

International Workers Memorial Day Special Story By Manda BhimReddy - Sakshi

ఎడారి దేశాల్లో గత ఎనిమిది ఏళ్లలో 1,600 మంది తెలంగాణ ప్రవాసుల మృతి 

ఎక్స్ గ్రేషియా కోసం ఎదురు చూస్తున్న గల్ఫ్ మృతుల కుటుంబాలు  

ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా ఏప్రిల్ 28 న 'అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం' (ఇంటర్నేషనల్ వర్కర్స్ మెమోరియల్ డే) జరుపుకుంటారు. విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడిన, వికలాంగులైన, అనారోగ్యానికి గురైన కార్మికుల స్మారకార్థం జరిపే ఈ కార్యక్రమాన్ని గత కొన్నేళ్లుగా  తెలంగాణ గల్ఫ్ కార్మిక సంఘాలు ఈ సందర్భాన్ని 'గల్ఫ్ అమరుల దినోత్సవం' (గల్ఫ్ మార్టియర్స్ డే) గా నిర్వహిస్తున్నారు. చనిపోయిన వారిని స్మరించండి - బ్రతికున్న వారి కోసం పోరాడండి (రిమెంబర్ ది డెడ్ - ఫైట్ ఫర్ ది లివింగ్) అనే నినాదంతో వలస కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. 

హైదరాబాద్ శంషాబాద్ ఏర్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారం.. ప్రతి సంవత్సరం దాదాపు 200 శవపేటికలు గల్ఫ్ దేశాల నుండి తెలంగాణకు చేరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 జూన్ 2014 నుండి ఏప్రిల్ 2022 వరకు దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో సుమారు 1,600 మంది తెలంగాణ వలస కార్మికుల శవపేటికలు రాష్ట్రానికి చేరుకున్నాయి. బతుకుదెరువు కోసం ఎడారి బాట పట్టిన 15 లక్షల మంది తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల కన్నీటి గాథ ఇది. గల్ఫ్ వలసలు అధికంగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎప్పుడు ఏవార్త వినాల్సి వస్తుందో అని ప్రవాసీ కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. జన్మభూమిని వదిలి వలస వెళ్లిన అభాగ్యులు గల్ఫ్ దేశాలలో అసువులు బాస్తున్నారు. శవపేటికల కోసం నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. కొందరిని అక్కడే ఖననం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల ఆసుపత్రుల మార్చురీలలో వందలాది భారతీయుల మృతదేహాలు మగ్గుతున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో లక్ష రూపాయలు.. స్వరాష్ట్రంలో మొండి చేయి 
ఆమ్నెస్టీ కారణంగా 2007 లో యూఏఈ దేశం నుండి వాపస్ వచ్చి అప్పుల బాధతో ఉత్తర తెలంగాణ కు చెందిన 29 మంది గల్ఫ్ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. ఒక లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా  ప్రకటిస్తూ 9 మే 2008 నాడు జీఓ (నెం. 266) ను జారీ చేసింది. ఆ తర్వాతి కాలంలో గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో చనిపోయిన పేద కార్మికులకు కూడా ఆర్ధిక సహాయం చేయడం ప్రారంభమైంది. ఉమ్మడి రాష్ట ప్రభుత్వం, ఆనాటి కరీంనగర్ జిల్లాలోని 34 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఒక లక్ష రూపాయల చొప్పున  ఎక్స్ గ్రేషియా మంజూరు చేస్తూ జీఓ నెం.1840 ను 24 ఏప్రిల్ 2013 న జారీ చేసింది. గవర్నర్ పాలనలో  ఆరు పాత జీఓ లను రీ-వాలిడేట్ చేసి జారీ చేసిన జీఓ ఇది. ఉమ్మడి రాష్ట్రంలో వేలాదిమంది గల్ఫ్ దేశాలలో మృతి చెందారు. అప్పటి ప్రభుత్వం 100 మందికి లోపే ఎక్స్ గ్రేషియా ఇచ్చింది. 

గుండెపోటు మరణాలు అధికం 
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్నారైలు ఎక్కువగా  హృదయ సంబంధిత సమస్యల కారణంగా మరణిస్తున్నారు. పగలు ఎండలో.. రాత్రి ఏసీ వాతావరణంలో నివసించడం, శారీరక, మానసిక ఒత్తిడి, జీవన శైలి, నిద్ర లేమి, ఆహారపు  అలవాట్లు, స్మార్ట్ ఫోన్ అధిక వినియోగం, ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకోకపోవడం లాంటి కారణాలు ఆకస్మిక మరణాలకు కారణాలని కొందరు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.  

గల్ఫ్ ఆత్మహత్యలు 
గల్ఫ్ దేశాల్లో భారతీయుల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. మానసిక, వ్యక్తిగత సమస్యలు, అప్పులు, కలలు కల్లలవడం, పనిలో ఒత్తిడి, అధమ స్థాయిలో జీవన పరిస్థితులు, సరిఅయిన వేతనాలు లేకపోవడం, భౌతిక దోపిడీ, మోసం, ద్రవ్యోల్బణం, ప్రియమైన కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, ఒంటరితనం, సమస్యలను భావాలను పంచుకోవడానికి ఒక సర్కిల్ లేకపోవడం, వైవాహిక జీవితానికి దూరం, నిరాశ, మద్యానికి బానిస అవడము లాంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
 
కోవిడ్ కు పూర్వం విదేశాలలో మరణాలు
2014 నుండి 2019 వరకు ఆరు సంవత్సరాల కాలంలో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 33,930 మంది ప్రవాస భారతీయులు మృతి చెందారని ప్రభుత్వం 20 నవంబర్ 2019 న లోక్ సభకు తెలిపింది. ఆరేళ్లలో సౌదీ అరేబియా (15,022), యుఏఈ (9,473), కువైట్ (3,580), ఓమాన్ (3,009), ఖతార్ (1,611), బహరేన్ (1,235) మంది ఎన్నారైలు చనిపోయారు.  ఆరు గల్ఫ్ దేశాలలో 89 లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా ఇందులో సగటున రోజుకు పదిహేను మంది ఎన్నారైలు మృత్యువాత పడుతున్నారు. ఇదిలా ఉండగా  2015 నుండి 2019 వరకు అయిదు సంవత్సరాల కాలంలో 125 దేశాలలో మృతి చెందిన 21,930 మంది మృతదేహాల  శవపేటికలను భారత్ కు తెప్పించామని ప్రభుత్వం 5 ఫిబ్రవరి 2020 న లోక్ సభకు తెలిపింది. వీటిలో అత్యధికం గల్ఫ్ దేశాలలో సంభవించాయి. 

కోవిడ్ వలన మరణాలు
విదేశాలలో కోవిడ్ వలన 4,048 మంది ఎన్నారైలు మృతి చెందారని ప్రభుత్వం 3 డిసెంబర్ 2021 న లోక్ సభ కు తెలిపింది. సౌదీ అరేబియా (1,154), యుఏఈ (894), కువైట్ (668), ఓమాన్ (551), బహరేన్ (200), ఖతార్ (109) ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 3,576 మంది కోవిడ్ తో చనిపోయారు. అన్ని దేశాల మొత్తం మరణాలలో పోలిస్తే గల్ఫ్ లోనే 88 శాతం మంది కోవిడ్ తో మృతి చెందారు. 

ప్రమాదాల్లో
విదేశాలలో ప్రమాదాల్లో మరణించిన భారతీయుల వివరాలను 3 డిసెంబర్ 2021 న ప్రభుత్వం లోక్ సభ లో వెల్లడించింది. గత మూడేళ్లలో 63 దేశాలలో 2,384 మంది ఎన్నారైలు ప్రమాదాలలో మృతి చెందారు. సౌదీ అరేబియా (683), యుఏఈ (370), కువైట్ (195), ఓమాన్ (94), ఖతార్ (60), బహరేన్ (44) ఆరు గల్ఫ్ దేశాలలో 1,446 మంది ప్రమాదాలలో మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన భారతీయుల ప్రమాద మరణాలలో గల్ఫ్ లోనే 61 శాతం సంభవించాయి. ఇదిలా ఉండగా గత మూడేళ్లలో నేపాల్ (227), ఫిలిప్పీన్స్ (153), మలేసియా (76), సింగపూర్ (55) మంది ప్రమాదాల్లో మృతి చెందారు. విదేశాల్లో 468 ప్రమాద పరిహార కేసులు పెండింగ్ లో ఉన్నాయి. కువైట్ (142), ఓమాన్ (127), సౌదీ అరేబియా (85), ఖతార్ (41), యుఏఈ (24) కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 

ఎడారిలో ఎండమావులు... కేసీఆర్ గల్ఫ్ హామీలు
14 ఏళ్ళ క్రితం... 2008 లో పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ ప్రసంగం యధాతదంగా (వీడియో ట్రాన్స్క్రిప్ట్): తెలంగాణ భూములు అమ్మగా వచ్చిన వేలకోట్ల రూపాయల నుండి గల్ఫ్ బాధితులను ఆదుకోవడం కొరకు వెంటనే ప్రభుత్వం 500 కోట్ల నిధులు ఏర్పాటు చేయాలి, విడుదల చేయాలని చెప్పి ఈ మహాసభ డిమాండ్ చేస్తావున్నది. గల్ఫ్ బాధితులై మరణించిన వ్యక్తుల కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తోంది. గల్ఫ్ లో ఉన్న తెలంగాణ ఎన్నారైల పిల్లలను స్థానికులుగా పరిగణించి, కేరళ ప్రభుత్వం ఏవిధంగా సాయం అందిస్తుందో అదే విధంగా విద్యా, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తోంది. గల్ఫ్ లో చనిపోయిన , ఆత్మహత్య చేసుకున్న వాళ్లకు ఆదుకోవడంతో పాటు స్వదేశం రావడానికి, గల్ఫ్ లో రాష్ట్ర ప్రభుత్వం మానిటరింగ్ సెల్‌ని వెంటనే ఏర్పాటు చేయాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తావున్నది.

మానవ వనరుల ఎగుమతి.. ఇంధనాల దిగుమతి 
భారత ప్రభుత్వం గల్ఫ్ దేశాలకు కార్మికులను (మానవ వనరులను) ఎగుమతి చేసి ఇంధనాలను దిగుమతి చేసుకుంటున్నది. ఇది  మనుషులను ఎగుమతి చేసి విదేశీ మారక ద్రవ్యం ఆర్జించే పక్కా ఎగుమతి, దిగుమతి వ్యాపారం. కార్మికులు తమ భార్యా బిడ్డలను, తల్లి దండ్రులను, కుటుంబాన్ని, కన్న ఊరును, ఈ దేశాన్ని వదిలి విదేశాల్లో ఒంటరిగా జీవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎడబాటుతో బాధపడుతున్నారు. వీరి త్యాగాలు మనం వెలకట్టగలమా ? ఈ దేశం కోసం డ్యూటీలో భాగాంగా ఎడారిలో దిక్కులేని వారిగా చనిపోయిన మన గల్ఫ్ ప్రవాసీ కార్మికులను "గల్ఫ్ అమరులు" అని పిలుచుకుందాం అని ప్రవాసీ సంఘాలు అంటున్నాయి. దేశ సరిహద్దులు దాటి అరబ్ గల్ఫ్ దేశాలలో సేవలందిస్తున్న వలస కార్మికులు భారతదేశానికి అపారమైన విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్నారు. దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న భారత సైనికుల మాదిరిగా వలస కార్మికులు కూడా దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారు 95% ఒంటరిగానే వెళుతున్నారు. తక్కువ వేతనం వలన కుటుంబాన్ని వెంట తీసుకెళ్ళలేరు. 

15 లక్షల మంది
తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. వీరు ప్రతి నెలా రూ. 1,500 కోట్లు విదేశీ మారక ద్రవ్యాన్ని భారత్ కు పంపిస్తున్నారు. ఈ విదేశీ మారకద్రవ్యంతో (ఫారిన్ ఎక్స్చేంజి) కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ (పెట్రోల్, డీజిల్) ఇంధనాలను కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ప్రవాసీ కుటుంబాలు ప్రతి నెల పొందుతున్న 1,500 కోట్ల రూపాయల సొమ్ము వినిమయంలోకి వచ్చి కనీసం 10 శాతం స్థానిక పన్నులు వసూలయినా నెలకు 150 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి జమ అవుతుంది, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఉపయోగపడుతున్నది.

ఎన్నారై పాలసీ, గల్ఫ్ బోర్డు ఏమైంది ?
2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమానికి టీఆర్ఎస్ ఎన్నికల ప్రణాళికలో అనేక హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోయింది. కేరళ, పంజాబ్ తరహా విధానాలను అవలంభిస్తామని తరుచూ చెబుతోంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ప్రత్యేక ప్రవాసి మంత్రిత్వ శాఖ ఏర్పడలేదు. ఇప్పటికీ సాధారణ పరిపాలన శాఖ (జిఏడి) లో ఎన్నారై సెల్ అని ఒక విభాగం మాత్రమే ఉన్నది. ఇప్పటికైనా గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు (గల్ఫ్ బోర్డు) ఏర్పాటు చేయాలి. సమగ్ర ఎన్నారై పాలసీ (ప్రవాసీ విధానం) ఏర్పాటు చేయాలి. ఆరోగ్య బీమా, జీవిత బీమా, ప్రమాద బీమా, పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని గల్ఫ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.  

- మంద భీంరెడ్డి (వలస వ్యవహారాల విశ్లేషకులు)
+91 98494 22622, mbreddy.hyd@gmail.com]

చదవండి: లైఫ్ అండ్ డెత్ ఇన్ ద గల్ఫ్

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top