నిజామాబాద్ అర్బన్: వినాయక చవితి వేడుకల్లో భాగంగా కలెక్టరేట్లో ప్రతిష్టించిన వినాయకుడికి శనివారం కలెక్టర్ భవేశ్మిశ్రా, సీపీ సాయిచైతన్య, అదనపు కలెక్టర్ భుజంగరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు. ట్రెసా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ్ రెడ్డి అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో డీఎస్వో శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం ప్రవీణ్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, డీఆర్వో గీత, ఆర్డీవో రాజేంద్రకుమార్, కలెక్టరేట్ ఏవో బాలరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ: రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు గడ్కోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని ఉప్పరి లిమిత ఎంపికై నట్లు పీడీ నవీన్ శనివారం తెలిపారు. కమ్మర్పల్లిలో జరుగుతున్న పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థిని లిమితను సర్పంచ్ సండ్ర లతాశంకర్, ఉపసర్పంచ్ సంపత్రెడ్డి, హెచ్ఎం శ్రీకాంత్, ఉపాధ్యాయులు అభినందించారు.
వేల్పూర్: వేల్పూర్ మండలం మోతె విజ్ఞాన్ స్కూల్ ప్రిన్సిపల్ జువ్వి హరీశ్ శనివారం హైదరాబాద్లో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. మెదక్, రంగారెడ్డి టీచర్ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, బీఎస్ఎంఏటీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్రెడ్డి అవార్డు అందజేశారు. అవార్డు రావడం సంతోషంగా ఉందని, తన బాధ్యతను మరింత పెంచిందని హరీశ్ పేర్కొన్నారు.
జక్రాన్పల్లి: మండలంలోని మునిపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను డీఎంహెచ్వో రాజశ్రీ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. గర్భిణిగా నమోదైనప్పటి నుంచే వారికి అందించాల్సిన టీకాలను, క్రమం తప్పకుండా చేయాల్సిన ఏఎన్సీ చెకప్లను తప్పకుండా చేయాలన్నారు. హైరిస్క్ గర్భిణులను గుర్తించి సివిల్ ఆస్పత్రికి, మాతాశిశు కేంద్రానికి తరలించాలని సూచించారు. నెలలు నిండిన గర్భిణులకు బర్త్ ప్లాన్ తయారు చేసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించేలా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మునిపల్లి చిన్న సాయిరెడ్డి, ఉప సర్పంచ్ ప్రశాంత్, ఆయుష్మాన్ ఆరోగ్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
– నిజామాబాద్ ఆర్ఎం.కృష్ణమూర్తి
నిజామాబాద్ రూరల్: టీజీఎస్ ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు అక్టోబర్ 9న నిర్వహించనున్నట్లు నిజామాబాద్ రీజియన్ మేనేజర్ కృష్ణమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. రీజియన్ పరిధిలో నిజామాబాద్–1, 2 కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్సువాడ డిపోల వారీగా ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు. ఓటరు జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికలను కార్మిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని, అక్టోబర్ 17న ఫలితాల వెల్లడి ఉంటుందని వివరించారు.


