● తెలంగాణ విద్యా కమిషన్
మాజీ చైర్మన్ ఆకునూరి మురళి
నిజామాబాద్ రూరల్: అధికారంలో ఉన్నవారు సొంత ప్రయోజనాలు, భూ కబ్జాలపైనే దృష్టిసారిస్తున్నారని, విద్యా, వైద్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలంగాణ విద్యా కమిషన్ మాజీ చైర్మన్ ఆకునూరి మురళి విమర్శించారు. నాణ్యమైన విద్య అందించేంత వరకు ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా బస్సు యాత్రలో భాగంగా శనివారం నగరంలోని పెన్షనర్స్ భవనంలో మేధావులు, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ రూ. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో స్కూళ్లకు ఇవ్వడానికి రూ.6 వేల కోట్లు లేవా అని ప్రశ్నించారు. రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి చంపాలాల్ మాట్లాడుతూ దేశంలో 11.5 లక్షల స్కూళ్లు ఉంటే.. పీఎంశ్రీ పథకం ద్వారా 6,500 స్కూళ్లను మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని, ఈ లెక్కన మొత్తం స్కూళ్లు అభివృద్ధి చేయాలంటే 350 ఏండ్లు పడుతుందన్నారు. నిజామాబాద్ నగరాభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి కె. రామ్మోహన్ రావు , పెన్షనర్స్ యూనియన్ నాయకులు ఎల్. శ్రీధర్, టీపీఎఫ్ సభ్యులు ప్రొఫెసర్ పద్మజాషా, డాక్టర్ పాలకుర్తి జగదీశ్వర్, ఎన్. రుబీనా, సృజన యాదవ్, డాక్టర్ సూరి, వాసు, ప్రసాద్ రావు, హుస్సేన్, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


