● ఉద్యోగాలు చేస్తూనే చదువు..
● ఒకే వేదికపై పట్టా అందుకున్న వనజ, తిరుమల దంపతులు
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఆ దంపతులిద్దరూ కుటుంబ బాధ్యతలు మోస్తూ, అధ్యాపకులుగా బాధ్యతలు నిర్వహిస్తూనే నిత్య విద్యార్థులుగా కొనసాగారు. ఎంచుకున్న అంశాలపై పరిశోధనలు చేసి ఇటీవల జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో ఒకే వేదికపై ఒకరి వెనక ఒకరు డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
వైకల్యాన్ని ఎదిరించి....
కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కాలేజీలో జువాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మల్సూర్ తిరుమల, సదాశివనగర్ మండలం మర్కల్ వద్ద ఉన్న తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్న వనజ భార్యాభర్తలు. మల్సూర్ తిరుమల అంగవైకల్యం ఉన్నా ఆత్మవిశ్వాసంతో చదువులో రాణించాడు. అదే సమయంలో ఉన్నత చదువులు చదివిన వనజ తోడైంది. ఇద్దరూ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాతా విద్యా ప్రయాణం కొనసాగించారు. తిరుమల ‘స్టడీస్ ఆన్ వాటర్ క్వాలిటీ అండ్ అసెస్మెంట్ ఆఫ్ మెటల్స్ ఇన్ వేరియస్ టిష్యూస్ ఆఫ్ ఫిష్ ఫ్రమ్ కాచాపూర్ లేక్, కామారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ, ఇండియా’ అనే అంశంపై ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. వనజ ‘డైవర్సిటీ, డిస్ట్రిబ్యూషన్ స్టేటస్ అండ్ ఎకాలజీ ఆఫ్ బట్టర్ఫ్లైస్ ఆఫ్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్, తెలంగాణ ఇన్ ఇండియా’ అన్న అంశంపై పీహెచ్డీ పూర్తి చేసి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తూ కుటుంబ బాధ్యతలు మోస్తూనే పరిశోధనలు కొనసాగించి డాక్టరేట్ పట్టా అందుకోవడం గమనార్హం. ఒకరినొకరం ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగామని, పరిశోధన పూర్తి చేసి డాక్టరేట్ సాధించామని వారు పేర్కొంటున్నారు.


