● హైదరాబాద్లోని ప్రభుత్వ
డెంటల్ కాలేజీలో బీడీఎస్ పూర్తి చేసిన శ్రీనివాస్
● తండ్రి బాటలోనే తనయుడు రుత్విక్
● ఎంబీబీఎస్ను కాదనుకుని
బీడీఎస్లో చేరిక
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : తండ్రి చదివిన కోర్సులో చేరేవారు చాలా మంది ఉంటారు. కానీ తండ్రి చదివిన కాలేజీలోనే సీటు పొందేవారు తక్కువ. అదీ బీడీఎస్ కోర్సులో.. కామారెడ్డికి చెందిన రుత్విక్ తండ్రి శ్రీనివాస్ చదివిన కళాశాలలోనే బీడీఎస్ కోర్సులో చేరారు. వివరాలిలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో దంత వైద్యుడిగా సుపరిచితులైన ఏవీ శ్రీనివాస్ కుటుంబంలో ఒకరిని చూసి ఒకరు వైద్య విద్య వైపు అడుగులు వేస్తున్నారు. అదీ డెంటల్ కోర్సువైపు.. ఏవీ శ్రీనివాస్ 1996 లో హైదరాబాద్లోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో బీడీఎస్ చదివారు. ఆ తర్వాత కామారెడ్డిలో ప్రాక్టీస్ ప్రారంభించారు. ప్రభుత్వ వైద్యుడిగా ఉద్యోగంలో చేరి రెండు దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం సివిల్ సర్జన్ (డెంటల్)గా సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి భార్గవి కూడా దంత వైద్యురాలిగా కామారెడ్డిలో ప్రైవేటు ప్రాక్టీస్ చేస్తున్నారు. శ్రీనివాస్ కుమారుడు ఏవీ రుత్విక్ సైతం తండ్రి బాటలో పయనిస్తున్నాడు. ఆయనకు ఎంబీబీఎస్ సీటు వచ్చే అవకాశం ఉన్నా.. దానిని కాదనుకుని బీడీఎస్ను ఎంచుకున్నాడు. తండ్రి చదివిన హైదరాబాద్లోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలోనే రుత్విక్కు సైతం సీటు రావడం విశేషం.
కుటుంబంలో మరికొందరు..
ఏవీ శ్రీనివాస్ తన దగ్గరి బంధువులకు మార్గదర్శిగా ఉన్నారు. ఆయన అక్క కుమారుడు పేరమ్ వినీ త్ 2020లో బీడీఎస్ పూర్తి చేసి కామారెడ్డిలో ప్రాక్టీస్ చేస్తున్నారు. మరో సోదరి కూతురు కరిపె సంతోషి శ్రావణి వీళ్ల వద్దే ఉండి చదువుకుని 2023 లో డిచ్పల్లిలోని తిరుమల డెంటల్ కాలేజీలో బీడీఎస్లో చేరింది. ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతోంది. అన్న కూతురు అక్షిత గతేడాది గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు పొంది మొదటి సంవత్సరం పూర్తి చేసింది.


