కామారెడ్డి రూరల్: సస్పెన్షన్కు గురైన ఓ ఆర్టీసీ డ్రైవర్ మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి పట్టణ కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని కల్కినగర్లో నివాసం ఉండే సాయన్న(48) ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఐదు నెలల క్రితం డిపోలో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడగా అతన్ని సస్పెండ్ చేసి సర్వీసు నుంచి తొలగించారు. నాటి నుంచి ఉద్యోగం పొందేందుకు పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. దీంతో మనస్తాపానికి గురైన అతను గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాయన్న మృతి పట్ల ఆర్టీసీ ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.
మద్యానికి బానిసై యువకుడు..
నవీపేట: మద్యానికి బానిసైన ఓ యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన నవీపేట మండలం జన్నెపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గౌరు సాయికుమార్(26) అనే యువకుడు కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. అప్పులు కూడా ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెంది గురువారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి గంగాధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మాక్లూర్: మండల పరిధిలోని ఓ వెంచర్లో అమ్మకాలు, కొనుగోళ్లలో చీటింగ్కు పాల్పడిన నందిపేట మండలం లక్కంపల్లి సర్పంచ్ సంతోష్గౌడ్, కరీంనగర్కు చెందిన రంజిత్రావును అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై అనిల్రెడ్డి శుక్రవారం తెలిపారు. గండ్ర వెంచర్లో నమ్మకంగా పని చేస్తూ సంతోష్గౌడ్ పలు అవకతవకలకు పాల్పడి రూ. కోట్లలో మోసం చేశాడని గండ్రా కంపెనీ ఫిర్యాదు మేరకు సర్పంచ్ సంతోష్గౌడ్పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.


