● ప్రజాధనాన్ని వృఽథా చేసిన ఘనత
కేసీఆర్కే దక్కుతుంది
● పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి
ఇందిర శోభన్
నిజామాబాద్ రూరల్: బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న పదేళ్లలో దళితులను అన్ని రకాలుగా మోసం చేసిందని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిర శోభన్ ఆరోపించారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి మూడు రోజులే వచ్చారని ఎద్దేవా చేశారు. నగరంలోని కాంగ్రెస్ భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకుండా ప్రజాధనాన్ని వృథా చేసున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుండేదని కేసీఆర్ వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులను చెల్లిస్తూ, సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తోందని, ఇది ప్రతిపక్ష నాయకులకు కనపడట్లేదా అని ప్రశ్నించారు. శాసనసభ వ్యవహారాల మంత్రిగా చేసిన హరీశ్రావుకు సభలో ఎలా ఉండాలో తెలియకపోవడం విచారకరమన్నారు. అసెంబ్లీ ఎదుట కేటీఆర్ కోపం ఎవరిపైనని ప్రశ్నించారు. అధికారం పోయిందనే దురాహంకారంతో వ్యవహరించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను అసెంబ్లీలో చర్చిస్తారనే ఉద్దేశంతో హరీశ్రావు, కేటీఆర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ ఎదుట ఇష్టం వచ్చినట్లు వ్యవహరించరని, స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలు సబితమ్మ, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మిలను అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం దళితులపై కపట ప్రేమ చూపుతోందని, బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకే ధోరణిలో వెళ్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో రెండు పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, ఉపాధ్యక్షులు శరత్, రత్నాకర్ గౌడ్, గాదారి గోపి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్ గౌడ్, బున్నే రవీందర్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగం, ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, కోశాధికారి భక్తవత్సలం పాల్గొన్నారు.


