● డీఎంహెచ్వో రాజశ్రీ
బోధన్టౌన్(బోధన్): పీసీపీఎన్డీటీ యాక్ట్ నిబంధనలు పాటించని స్కానింగ్ సెంటర్లపై చర్యలు తప్పవని జిల్లా వైద్యాధికారి రాజశ్రీ హెచ్చరించారు. బోధన్ పట్టణంలోని మూడు స్కానింగ్ కేంద్రాలను ఆమె గురువారం తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. స్కానింగ్ సమయంలో గర్భస్థ శిశువు ఆడ, మగ అనే విషయాన్ని తెలపడం విరుద్ధమని, ఫాం–ఎఫ్ను పూర్తి వివరాలతో తప్పులు లేకుండా నమోదు చేయాలని సూచించారు. సరైన రిఫరల్ మేరకు మాత్రమే ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ నిర్వహించాలన్నారు. కాగా, శ్రీకృష్ణ స్కానింగ్ సెంటర్లో రికార్డులు పరిశీలిస్తుండగా దురుసుగా మాట్లాడిన నిర్వాహకులపై డీఎంహెచ్వో మండిపడ్డారు. రికార్డుల నిర్వహణతోపాటు రిజస్టర్లు సక్రమంగా నిర్వహించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. ఆమె వెంట డిప్యూటీ డీఎహెచ్వో విద్య, పీసీపీఎన్డీటీ అధికారులు ఉన్నారు.


