నిజామాబాద్ రూరల్: ప్రజల ఆరోగ్యంపై వైద్యసిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని ట్రెయినీ కలెక్టర్ సురేష్ పామూరి అన్నారు. జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో సోమవారం వైద్య ఆరోగ్యశాఖలోని అన్ని విభాగాల అధికారులతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి ట్రెయినీ కలెక్టర్ సురేష్ పామూరి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. పాఠశాల, కళాశాలలో ఆరోగ్యంపై అవగాహన కల్పించాలలన్నారు. గెలుపొందిన వారికి బహుమతుల ను ప్రోత్సాహంగా అందించాలన్నారు. కాలేజీలలో కాంపిటీషన్లను నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేయాలన్నారు. వివిధ శాఖల సమన్వయంతో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. ప్రాథమిక ఆరోగ్యాన్ని బలోపేతం చేయాలన్నారు. మానవతా ధృక్పథంతో పనిచేస్తూ కొత్తదనాన్ని, సృజనాత్మకత దృష్టితో సాధారణ సేవలకు భిన్నంగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. అనంతరం జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై డీఎంహెచ్వో వివరించారు. వైద్యశాఖ అధికారులు బేబీ నాగేశ్వరి, అశోక్, సుమంత్ కుమార్, విద్య, సికందర్నాయక్, రవీందర్, వెంకన్న, అంజన, సుప్రియ, శిఖర, నవ్య, వెంకటేష్, భార్గవి, శ్రావ్య, కీర్తన, రాజేశ్వర్, నారాయణ, విశాల, ఘన్పూర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


