పిట్లం: ప్రమాదవశాత్తు ఓ యువకుడు చెరువులో జారిపడి మృతి చెందిన ఘటన పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేకల వినయ్(19) శుక్రవారం ఉదయం గ్రామ శివారులోని చెరువులో తన మేకలను కడిగేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. అతడికి ఈత రాకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
నవీపేట: మండలంలోని రాంపూర్ గ్రామంలో సుంకరి గంగుబాయి కి చెందిన పూరి గుడిసె శుక్రవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైంది. ప్రమాదంలో రూ. 80 వేల నగదు తో పాటు సామగ్రి, బట్టలు కాలి బూడిదయ్యాయి. రెవెన్యూ అధికారులు పంచనామ చేశారు. బాధిత కుటుంబానికి సర్పంచ్ ఎరువుల కమలాకర్ మరి కొంతమంది నగదును అందించి చేయూతనిచ్చారు.
మద్నూర్: మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఎదురుగా ఉన్న కాలనీలో శుక్రవారం ముగ్గురిపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కల దాడిలో కంటాలప్ప, నాందేవ్, స్వరూప లకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


