తెయూ(డిచ్పల్లి): జాతీయ సేవా పథకంలో భాగస్వామ్యం కావడం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ వికాసం, సేవా భావం పెంపొందుతాయని తెయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అపర్ణ పేర్కొన్నారు. తెయూ ఎన్ఎస్ఎస్ యూనిట్ 4 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వలంటీర్ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ను శుక్రవారం ప్రొఫెసర్ అపర్ణ ప్రారంభించారు. సమాజ సేవలో విద్యార్థులు చురుకై న పాత్ర పోషించాలని ‘నాట్ మీ బట్ యూ’ అనే ఎన్ఎస్ఎస్ స్ఫూర్తితో సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ 4 ప్రోగ్రాం ఆఫీసర్ సీహెచ్ నర్సయ్య మాట్లాడుతూ.. ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఈ నెల 21 నుంచి 23 వరకు కొనసాగుతుందన్నారు. వలంటీర్లు సమీర్, అజయ్, అనిల్, లెనిన్ తదితరులు ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు.
వేల్పూర్(మెండోరా): ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం నిలకడగా ఉంటోంది. ఎస్సారెస్పీకి ప్రస్తుతం 1013 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా, అంతే స్థాయిలో అవుట్ ఫ్లో అవుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 44.266 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాకతీయ కాలువ ద్వారా 300, మిషన్ భగీరథ పథకానికి 231 క్యూసెక్కులు విడుదలవుతుండగా, 482 క్యూసెక్కుల నీరు ఆవిరవుతోందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
నిజామాబాద్ అర్బన్: ఎస్సై, కానిస్టేబుల్ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు జిల్లా కేంద్రంలో ఉచితంగా శిక్షణ అందించనున్నట్లు కోచ్ సయ్యద్ కై సర్ తెలిపారు. నాగారంలోని రాజారాం స్టేడియంలో ఫిజికల్ ట్రైనింగ్, ఖిల్లా రోడ్లో ఉన్న మహమ్మదీయ కమ్యూనిటీ హాల్లో రాత పరీక్షకు సంబంధించిన శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అన్నివర్గాలకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 9849283407 నెంబర్ లో సంప్రదించాలని తెలిపారు.


