నందిపేట్(ఆర్మూర్): రసాయనాలు లేకుండా కూరగాయలు సాగు చేయడంపై విద్యార్థులకు అవగాహన కల్పించడంతోపాటు వారు సాగు చేసిన కూరగాయలను వారే తినేందుకు ఉద్దేశించిన ‘కిచెన్ గార్డె న్’లు నందిపేట మండలంలో సక్సెస్ఫుల్గా సాగవుతున్నాయి. ఖాళీ సమయంలో పాఠశాలల ఆవరణలోని కిచెన్ గార్డెన్లో విద్యార్థులు కూరగాయల సాగు పనులు చేస్తున్నారు. చేతికందిన కాయగూరలను మధ్యాహ్న భోజనానికి వినియోగించుకుంటున్నారు. మండలంలోని ఆయా స్కూళ్లలో ప్రధానోపాధ్యాయుల చొరవ, ఉపాధ్యాయుల తోడ్పాటు, విద్యార్థుల కృషి ఫలితంగా బడితోటలు కళకళలాడుతున్నా యి. బాద్గుణ, వెల్మల్, అయిలాపూర్, కంఠం పాఠశాలలతోపాటు మరి కొన్ని స్కూళ్లలో ఆకు కూరలతోపాటు కూరగాయలతో రోజుకో రకమైన వంటకాలను అందిస్తూ విద్యార్థుల సంపూర్ణ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నారు. అలాగే పసుపు, అరటి తోటలను సైతం పండిస్తున్నారు. సాగుకోసం గ్రీన్నెట్ షెడ్లను నిర్మించడం గమనార్హం. నిత్యం ఇలా తోటలోని టమాట, బీరకాయ, మిర్చి, వంకాయ, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఆకు కూరలు తెంపి వంటకు వినియోగిస్తున్నారు. సాగుకోసం విద్యార్థులతో కిచెన్ గార్డెన్ కమిటీలను వేశారు.
పాఠశాలల ఆవరణలో
కూరగాయల సాగు
సేంద్రియ విధానాన్ని
అవలంబిస్తున్న విద్యార్థులు
మధ్యాహ్న భోజనానికి వినియోగం


