ఆర్మూర్: ఉత్తర తెలంగాణ వరప్రదాయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రతి ఏటా వృథాగా పోతున్న లక్షల క్యూసెక్కుల వరద నీటిని ఆర్మూర్ ప్రాంత రైతుల కోసం మళ్లించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అర్గుల్ రాజా రాం (గుత్ప) ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. మొ దటి సారి అధికారంలోకి రాగానే రూ.204 కోట్ల కేటాయించి త్వరితగతిన పనులు పూర్తి చేయించారు. ఎస్సారెస్పీలోని గోదావరి నది జీరో పాయింట్ నుంచి 17 కిలో మీటర్ల దూరంలోని నందిపేట మండలం ఉమ్మెడ గ్రామ శివారులో నాలుగు మో టార్లతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. మాక్లూ ర్ మండలం లక్ష్మాపూర్ శివారులో రెండో దశ పంప్హౌజ్ నిర్మాణం చేట్టారు. 2008 మార్చి 18న వైఎస్ రాజశేఖరరెడ్డి తన స్వహస్తాలతో అర్గుల్ రాజారాం (గుత్ప) ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. ఎస్సారెస్పీ జలాలు 22.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆర్మూర్ ప్రాంత వ్యవసాయ భూములకు అందుతుండటంతో ఇక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో పంటలు సాగు చేశారు. మూడు దశాబ్దాలుగా సాగునీరందక బీళ్లు వారిన నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టు ప్రాంతమైన ఆర్మూర్లో సాగునీటి గలగలలతో రైతాంగం పులకించింది.
ప్రస్తుత పరిస్థితి ఏమిటి?
ఎస్సారెస్పీలో ఈ ఏడాది నీటి నిలువ ఆశాజనకంగా లేదు. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 1091 అడుగులు (80.5 టీఎంసీలు) కాగా.. బుధవారం సాయంత్రానికి కేవలం 1079.40 అడుగుల (43.371 టీఎంసీలు) నీరు నిల్వ ఉంది. ఎగువన ఉన్న మహారాష్ట్ర ప్రాంతం నుంచి ఆశించిన మేర వరద రాకపోకగా.. స్థానికంగా సాధారణ వర్షపాతం కూడా నమోదు కావడం లేదు. దీంతో ఎస్సారెస్పీలోకి ఆశించిన మేర నీరు చేరలేదు. ఈ పరిస్థితుల్లో పాలకులు రాజకీయాలను పక్కన పెట్టి కాళేశ్వరం నీటినైనా ఎస్సారెస్పీకి చేరుస్తారేమోనని రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాలకులు స్పందించి గుత్ప ఎత్తిపోతల పథకం నుంచి నీటిని విడుదల చేసి తమ గ్రామాల చెరువులను నింపాలని కోరుతున్నారు.
పరిగెత్తే నీటికి నడక నేర్పాలి.. నడిచే నీటికి నిలకడ నేర్పాలి.. నిలిచిన నీటిని సాగుకు వినియోగించి రైతుల అభ్యున్నతికి తోడ్పడాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞ ఫలం గుత్ప (అర్గుల్ రాజారాం) ఎత్తిపోతల పథకం. అయితే ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకం ప్రశ్నార్థకంగా మారుతోంది.
గుత్ప ఎత్తిపోతలే దిక్కు
ఆర్మూర్ ప్రాంత రైతులు పంటలు పండించాలంటే గుత్ప ఎత్తిపోతల పథకమే దిక్కు. చెరువులు నిండితేనే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి వర్షాలతో సంబంధం లేకుండా ఎత్తిపోతల నీటితో చెరువులు నింపడానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలి. – నాగం నాగన్న, రైతు, పిప్రి, ఆర్మూర్ మండలం
ముందుగానే చెరువులు నింపాలి
ఆర్మూర్ ప్రాంతం తలాపునే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉన్నా ఈ ప్రాంత రైతులు ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఇక్కట్లు పడ్డారు. ఎల్నినో ఎఫెక్ట్ గురించి అధికారులకు ముందుగానే సమాచారం ఉంది కాబట్టి గుత్ప ఎత్తిపోతల నీటితో ఆర్మూర్ ప్రాంత చెరువులను ముందుగానే నింపాలి. – ఏపీ గంగారాం, రైతు, పిప్రి, ఆర్మూర్ మండలం
ఆయకట్టు రైతుల్లో ఆందోళన
ఎస్సారెస్పీలోకి ఆశించిన మేర
చేరని వరద నీరు
ప్రస్తుతం నిల్వ ఉంది
43.371 టీఎంసీలే..
ఖరీఫ్తోపాటు యాసంగి సాగూ ప్రశ్నార్థకమే?


