● అధికారులతో కలెక్టర్ భవేశ్ మిశ్రా
● ఎడపల్లి కస్తూర్బా, బాలికల గురుకులం సందర్శన
బోధన్: నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడంతోపాటు బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎడపల్లి శివారులో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, తెలంగాణ బాలికల గు రుకు పాఠశాల/కళాశాలను కలెక్టర్ బుధవారం సందర్శించారు. కస్తూర్బా స్కూల్లో మరమ్మతులకు నోచుకోక నిరూపయోగంగా ఉన్న ఆర్వో వాటర్ ప్లాంట్, సొలార్ హీటర్లకు మరమ్మతులు చేయించి ఉపయోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలతోపాటు వంటగది, స్టోర్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. స్కూల్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని, విశాలమైన ఖాళీ స్థలాన్ని అన్నీ వసతులతో కూడిన క్రీడా మైదానంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. కేజీబీవీలో బాలికల సంఖ్య తక్కువ ఉన్నందున ఇతర విద్యార్థినుల ప్రవేశం కోసం రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడుతానని అన్నారు. అనంతరం తెలంగాణ బాలికల గురుకుల కళాశాలను సందర్శించారు. కళాశాల ఆవరణలో వరి, కూరగాయల సాగును పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. రెండు విద్యా సంస్థల్లోనూ పదో తరగతి విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. పలు ప్రశ్నలు వేసి వారి అభ్యసన సామర్ాధ్యలను పరిశీలించారు. తన వెంట తీసుకొచ్చిన బహుమతులను అందజేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ దత్తాద్రి, ఎంఈవో శివలింగ్ గాలప్ప, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ దీపిక, బాలికల గురుకుల కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సురేఖ తదితరులు ఉన్నారు.
పదోతరగతి విద్యార్థినులతో మాట్లాడుతున్న
కలెక్టర్ భవేశ్ మిశ్రా
బాలికల గురుకులం పరిసరాలను పరిశీలిస్తున్న కలెక్టర్ భవేశ్ మిశ్రా


