● ఏడుగురి విద్యార్థుల సస్పెండ్
● హోలీ సంబరాల్లో చోటు చేసుకున్న ఘటన
భిక్కనూర్: తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్క్యాంపస్లో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య మంగళవారం అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. హోలీ సంబరాల్లో పాల్గొన్న విద్యార్థులు డీజే సౌండ్ పెట్టుకుని నృత్యాలు చేస్తుండగా వివాదం తలెత్తింది. ఒకరి నుంచి మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో హిస్టరీ విభాగానికి చెందిన జూనియర్ విద్యార్థి రాజు తలకు గాయమైంది. విద్యార్థి రాజును దోమకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అనంతరం జూనియర్ విద్యార్థులు బాలుర వసతి గృహం ప్రాంగణంలో ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఆంజనేయులు బాలుర హాస్టల్ వార్డెన్ యాలాద్రి సౌత్క్యాంపస్నకు చేరుకొని విద్యార్థులను సముదాయించి నిరసనను విరమింపజేశారు. బుధవారం ఉద యం విషయం తెలుసుకున్న రాజు కుటుంబ సభ్యులు సౌత్ క్యాంపస్కు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరోమారు సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నెలకొంది. జూనియర్ విద్యార్థులు ప్రిన్సిపాల్ చాంబర్ ఎదుట ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఆంజనేయులు, ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్ సీనియర్, జూనియర్ విద్యార్థులతో మాట్లాడి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్ మాట్లాడుతూ.. ఘర్షణకు కారకులైన ఏడుగురు సీనియర్ విద్యార్థులను బాలుర వసతి గృహం నుంచి తాత్కాలింకగా సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఈ విషయమై కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ వివరించారు.
తలుపులు మూసేసి దాడి?
హోలీ సందర్భంగా సంబరాల్లో పాల్గొన్న విద్యార్థులు రెండు గ్రూపులుగా సీనియర్, జూనియర్లుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. కొంత మంది జూనియర్ విద్యార్థులను సీనియర్లు మెస్ రూంలోకి తీసుకెళ్లి తలుపులు మూసి దాడులకు పాల్పడినట్లు జూనియర్లు ఆరోపించారు.


